ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో చివరి రోజు భారత అథ్లెట్స్ సత్తా చాటారు. బుధవారం భారత అథ్లెట్స్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్య పథకాలు సాధించారు. మహిళల 1500 మీటర్ల పరుగులో పీయూ చిత్ర స్వర్ణం సాధించింది. 4 నిమిషాల 14.56 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఈ పోటీల్లో భారత్కు మూడో పసిడి లభించింది. ఇంతకుముందు గోమతి మరిముత్తు (మహిళల 800మీ), తేజిందర్ పాల్ సింగ్ (పురుషుల షాట్పుట్) స్వర్ణ పతకాలు గెలిచారు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో చిత్రకు వరుసగా ఇది రెండో స్వర్ణం. 2017లో జరిగిన ఛాంపియన్షిప్లోనూ చిత్ర స్వర్ణం గెలుచుకుంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మహిళల 200 మీటర్ల పరుగులో ద్యుతి చంద్ కాంస్య పతకాన్ని సాధించింది. ద్యుతి 23.24 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు పురుషుల 1500 మీటర్ల పరుగులో అజయ్ కుమార్ సరోజ్ రజతం గెలిచాడు. 3ని:43:18 సెకన్లలో గమ్యానికి చేరి రజతం సాధించాడు. ఇక 4×400 మీటర్ల రిలే పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ రజతాలు కైవసం చేసుకుంది. టోర్నీలో భారత్ మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది.