ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత ఆటగాళ్లు సత్తాచాటి మూడో రోజు మూడు పతకాలు తెచ్చిపెట్టారు. మహిళల హెప్టాథ్లాన్లో స్వప్నా బర్మన్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలిచింది. లాంగ్జంప్, 800 మీటర్లు, 200 మీటర్లు, షాట్పుట్, 100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, జావెలిన్ త్రో అంశాల్లో పోటీపడిన స్వప్నా బర్మన్ మొత్తం 5993 పాయింట్లు స్కోరు చేసింది. అయితే ఉజ్బెకిస్తాన్ అమ్మాయి ఎకతెరీనా వొర్నినా 6198 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
4×400మీ మిక్స్డ్ రిలేలో మొహమ్మద్ అనస్, పూవమ్మ, విస్మయ, అరోకియా రాజీవ్లతో కూడిన భారత జట్టు రజతం గెలుచుకుంది. ఈ జట్టు 3 నిమిషాల 16.71 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది. మహిళల 10000 మీటర్ల రేసులో సంజీవని 32ని:44.96 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని గెలిచింది. మహిళల 200 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ సెమీఫైనల్కు.. పురుషుల 1500 మీటర్ల విభాగంలో అజయ్ కుమార్ సరోజ్ ఫైనల్కు అర్హత సాధించారు. అయితే జిన్సన్ జాన్సన్ గాయం కారణంగా 1500మీ రేసు నుంచి తప్పుకున్నాడు. భారత్ ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఐదు కాంస్యాలు గెలుచుకుంది.