
హైదరాబాద్: తెలుగుమ్మాయి ప్రపంచ స్థాయిలో తొలిసారి రికార్డును నమోదు చేసింది. బుద్దా అరుణా రెడ్డి భారత్కు ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ చరిత్రలోనే తొలిసారి పతాకాన్ని సాధించిపెట్టింది. వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్గా ఆమె రికార్డులకెక్కింది. మెల్బోర్న్లో జరుగుతున్న ప్రపంచకప్లో అరుణ.. మహిళల వాల్ట్ ఈవెంట్లో కాంస్యం సాధించింది.
ఈ పోటీలలో ఆమె 13.649 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. అరుణ కొద్ది పాటి తేడాతోనే రజిత పతకాన్ని చేజార్చుకుంది. స్వల్ప తేడాతో ఎమిలీ (ఆస్ట్రేలియా) చేతిలో పరాజయానికి గురైంది. ఎమిలీ 13.699 పాయింట్ల సాధించింది. స్వర్ణాన్ని కైవసం చేసుకున్న కిస్లెఫ్ (స్లొవేనియా) 13.8 పాయింట్లతో నిలిచింది.
హైదరాబాద్కు చెందిన అరుణకు ఇదే తొలి అంతర్జాతీయ పతకం కూడా. ఆమె 2013లో ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, 2014లో కామన్వెల్త్, ఆసియా క్రీడలు.. 2017 ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో పోటీ పడింది కానీ.. పతకం సాధించలేకపోయింది. 2016 రియో ఒలింపిక్స్లో త్రుటిలో కాంస్యానికి చేరువగా వెళ్లిన దీపా కర్మాకర్ సైతం ఆసియా ఛాంపియన్షిప్, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించింది కానీ ప్రపంచకప్లో పతకం గెలవలేదు.
అరుదైన ఘనత సాధించిన అరుణను చూసి గర్విస్తున్నామని భారత జిమ్నాస్టిక్స్ సమాఖ్య కార్యదర్శి శాంతికుమార్ సింగ్ అన్నాడు. జిమ్నాస్టిక్స్లో ప్రపంచ ఛాంపియన్షిప్ తర్వాత ప్రపంచ కప్ రెండో ఉత్తమ టోర్నీ. ఒకే ఏడాదిలో ఎక్కువ సంఖ్యలో ప్రపంచకప్ టోర్నీలను నిర్వహిస్తారు. మెల్బోర్న్లో జరుగుతున్న ప్రస్తుత ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్లో 16 దేశాలకు చెందిన అథ్లెట్లు పోటీపడుతున్నారు.