
హైదరాబాద్: తెలుగమ్మాయి, అంతర్జాతీయ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మరోసారి సత్తాచాటింది. సురేఖ ప్రపంచ కప్ ఫైనల్కు అర్హత సాధించింది. సోమవారం ప్రకటించిన ప్రపంచ కప్ మిక్స్డ్ టీమ్ ర్యాంకింగ్స్లో జ్యోతి సురేఖ- అభిషేక్వర్మల జోడీ నంబర్వన్ ర్యాంకు సాధించింది. ఇటీవల వరుస విజయాలతో అద్భుతఫామ్లోనున్న ఈ విజయవాడ ఆర్చర్ ప్రపంచ కప్ స్టేజ్-4 ఈవెంట్లో రెండు పతకాలు సాధించింది.
మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో రజతం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకం అందుకుంది. టోర్నీ ఆద్యంతం దీటుగా రాణించిన జ్యోతి సురేఖ, మస్కార్ కిరార్, త్రిషా దేబ్లతో కూడిన భారత మహిళల బృందం ఫైనల్లో మాత్రం తడబడింది. టైటిల్పోరులో భారత జట్టు 228-229 స్కోరు తేడాతో ఫ్రాన్స్ బృందం చేతిలో ఓడి రజతంతో సంతృప్తి పడింది. ఇక తర్వాత జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ కాంస్యపోరులో జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మతో కూడిన భారత ద్వయం 156-153 తేడాతో టర్కీ జంటపై విజయం సాధించి పతకం అందుకుంది.
జ్యోతి-వర్మ జోడీకిది ఈ ఏడాది వరుసగా నాలుగో పతకం కావడం విశేషం. షాంఘై, అంటాల్యా, సాల్ట్లేక్ ఈవెంట్లలోనూ జ్యోతి బృందం పతకాలు కొల్లగొట్టారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్లో ప్రపంచ కప్ ఫైనల్కు అర్హత సాధించడం సురేఖ- అభిషేక్లకు ఇదే తొలిసారి.
సీజన్లో జరిగిన నాలుగు ప్రపంచకప్లలో (షాంఘై, అంటాల్యా, సాల్ట్లేక్ సిటీ, బెర్లిన్) సురేఖ-అభిషేక్ జంట నిలకడగా రాణించి నాలుగు కాంస్య పతకాలు గెలిచింది. తద్వారా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి తొలిసారి అర్హత పొందింది. ఈ మెగా ఈవెంట్ సెప్టెంబరు 29, 30 తేదీల్లో టర్కీలోని సామ్సన్ నగరంలో జరుగుతుంది.