ఆర్చరీ ప్రపంచకప్ రెండో స్టేజ్లో భారత్ సత్తాచాటుతోంది. శనివారం రెండు పతకాలు సాధించింది. ఉమెన్స్ కాంపౌండ్ టీమ్ విభాగంలో ఓ స్వర్ణం, మిక్సడ్ టీమ్ విభాగంలో ఓ రజతంతో హోరెత్తించింది. ఈ రెండు పతాకాల విజేత జట్టులో తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ ఉండటం విశేషం. కాంపౌండ్ మహిళల జట్టు విభాగంలో భారత త్రయం జ్యోతి సురేఖ, ప్రణీత్ కౌర్, అదితి స్వామి ఆరు పాయింట్ల తేడాతో పసిడి గెలిచారు.
టర్కీకి చెందిన హజల్ బురన్, ఐసె బెరా సుజర్, బేగం యువానా టీమ్పై ప్రపంచ నంబర్ వన్ అయిన భారత జట్టు ఆది నుంచి ఆధిపత్యం చెలాయించింది. ఒక సెట్ను కూడా వదలకుండా 232-226 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ప్రపంచకప్లో భారత త్రయం జ్యోతి, ప్రణీత్, అదితికి ఇది మూడో స్వర్ణం. గత రెండు సార్లు విజయం సాధించిన జ్యోతి టీమ్ ఈసారి విజయ ఢంకా మోగించి గోల్డ్ మెడల్స్ హ్యాట్రిక్ సాధించింది.

గతేడాది పారిస్లో జరిగిన నాలుగో దశ పోటీలో, గత నెలలో షాంఘై వేదికగా జరిగిన స్టేజ్-1లో జ్యోతీ జట్టు స్వర్ణాలు సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత ద్వయం జ్యోతి సురేఖ-ప్రియాన్ష్ రెండు పాయింట్లతో స్వర్ణాన్ని కోల్పోయారు. యూఎస్ఏకు చెందిన ఒలివియా డీన్, సాయర్ జోడీ 155-153 పాయింట్ల తేడాతో గెలిచారు. ఓపెనింగ్ రౌండ్లో ఆధిక్యం కోల్పోవడం జ్యోతి ద్వయంపై ప్రభావం చూపించింది. లేదంటే జ్యోతి సురేఖ ఖాతాలో శనివారం రెండు స్వర్ణాలు ఉండేవి.
ఆర్చరీ ప్రపంచకప్-2024 నాలుగు అంచెల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో షాంఘై వేదికగా స్టేజ్-1 పోటీలు జరిగాయి. ప్రస్తుతం దక్షిణకొరియాలోని యెచియాన్ వేదికగా స్టేజ్-2 పోటీలు జరుగుతున్నాయి. జూన్లో టర్కీలో స్టేజ్-3 నిర్వహిస్తారు. ఈ మూడంచెల్లో క్వాలిఫై అయిన ఆర్చర్లు మెక్సికోలో జరిగే చివరి స్టేజ్ పోటీలకు అర్హత సాధిస్తారు. కాగా, ఈ ప్రపంచకప్లో భారత్ ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు, ఓ కాంస్యం సాధించింది.