
రాంచీ: రెండేళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకున్న భారత ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయిలో ఉన్న నేపథ్యంలో సామాజిక దూర నిబంధనలను పాటిస్తూ మంగళవారం రాంచీలోని మొరాబాదిలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి మీడియా, తోటి ఆర్చర్లకి ఆహ్వానం అందలేదు.
సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్న దీపిక, అతాను రెండేళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వివాహం మాత్రం 2020 టోక్యో ఒలింపిక్స్ తర్వాత చేసుకోవాలని గతంలో నిర్ణయించుకున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీంతో ఈ ఇద్దరు ఆర్చర్లు పెళ్లితో ఒక్కటయ్యారు. తాము పెళ్లి చేసుకోబుతున్నాము అని గత వారం దీపిక ప్రకటించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ.. ప్రభుత్వ నిబంధనలకి లోబడి వివాహం జరుగుతుందని స్పష్టం చేశారు.
దీపిక కుమారి చెప్పిన ప్రకారమే పరిమిత సంఖ్యలో అతిథుల్ని ఆహ్వానించారు. రాంచీ పట్టణం మొరాబాదిలోని ఓ కళ్యాణ మండపంలో దీపిక, అతాను వివాహం జరగగా.. తొలుత సాయంత్రం 5.30 గంటలకి 50 మంది అతిథులు వచ్చి దంపతుల్ని ఆశీర్వదించారు. ఇక 7 గంటల తర్వాత మరో 50 మంది అతిథులు వచ్చారు. ఈ రెండో షెడ్యూల్లోనే ఝార్ఖండ్ సీఎం వచ్చి నవదంపతుల్ని ఆశీర్వదించారు. వచ్చిన అతిథులకు మాస్కులు, శానిటైజర్లని కూడా వివాహ వేదిక వద్ద ఏర్పాటు చేశారు.
అర్జున అవార్డు గ్రహితైన దీపిక కుమారి.. భారత్ ఆర్చరీ టీమ్ విభాగం తరఫున ఎన్నో మెడల్స్ గెలిచారు. 2010 కామన్వెల్త్ గేమ్స్ రికర్వ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో బంగారు పతకం సాధించారు. 2012 ఆర్చరీ వరల్డ్ కప్ విభాగంలోను గోల్డ్ నెగ్గిన దీపిక.. 2014, 13 ప్రపంచకప్ టోర్నీల్లో టీమ్ విభాగాల్లో పసిడి గెలుపొందారు. ఇక అతాను దాస్ 2019 ఆర్చరీ ప్రపంచకప్ చాంపియన్ షిప్ సిల్వర్ మెడల్ గెలిచిన పరుషుల జట్టులో సభ్యులు. గతేడా బ్యాంకాగ్ వేదికగా జరిగి ఆసియా ఆర్చరీ చాంపియన్ షిప్లో వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించారు. దీపిక, అతాను ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్లో తమ బెర్తులు ఖరారు చేసుకున్నారు.