
హైదరాబాద్: గువహటి వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఖేలో ఇండియా పోటీల్లో ఓ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల ఆర్చరీ క్రీడాకారిణి శివాంగిని గొహేన్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పారపాటుగా ఒక బాణం వచ్చి ఆమె మెడకు గుచ్చుకుంది. దీంతో ఆమెను హుటాహుటిన గుహవటిలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పడంతో ఎయిర్ అంబులెన్స్లో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రూమా సెంటర్కు తరలించారు. ఈ మేరకు స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాప్) అధికారిక ప్రకటన చేసింది. ఈ ఘటనపై శాప్ అథారిటీ సెక్రటరీ శ్యామ్ జులానియా మాట్లాడారు.
"అస్సాంలోని దిబ్రూఘర్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పొరపాటున ఒక బాణం వచ్చి శివాంగిని మెడకు గుచ్చుకుంది. ఆమె పరిస్థితి కొంత విషమంగా మారడంతో ఎయిమ్స్ ట్రూమా సెంటర్కు తరలించాం. శివాంగిని కోలుకునేవరకు ఆమెకయ్యే వైద్య ఖర్చులన్నింటిని శాప్ భరిస్తుంది" అని శ్యామ్ జులానియా తెలిపారు.
ఇక, ఎయిమ్స్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ అమిల్ లత్వాల్ మాట్లాడుతూ "శుక్రవారం ఉదయం 8గంటల ప్రాంతంలో శివాంగిని ఎయిమ్స్లో చేరారు. ప్రస్తుతం ఆమెను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచామని, అన్ని నివేదికలు వచ్చిన తర్వాత చికిత్సకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పారు.
కాగా, జనవరి 10 నుంచి జనవరి 22 వరకు జరగనునన్న ఈ ఖేలో ఇండియా పోటీలను మొత్తం 20 విభాగాల్లో నిర్వహించనున్నారు. 37 రాష్ట్రాలకు చెందిన 6,800 మంది అథ్లెట్లు 20 క్రీడా విభాగాల్లో అండర్-17, అండర్-21 కేటగిరీల్లో పతకాల కోసం పోటీపడనున్నారు.