వరల్డ్ ఛాంపియన్షిప్స్లో ఓటమి ఎరుగని భారత స్టార్ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ ఈసారి కేవలం కాంస్యంతో సరిపెట్టుకుంది. గత రెండు అండర్-20 వరల్డ్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణం నెగ్గిన అంతిమ్.. ఈసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది. సెమీఫైనల్లో వనీసా కలాజీస్కాయా చేతిలో ఓటమి చవిచూసింది.
ఇది ఆమెకు వరల్డ్ ఛాంపియన్షిప్స్లో తొలి ఓటమి కావడం గమనార్హం. ఈ ఓటమిని ఊహించని అంతిమ్ (Antim Panghal).. సెమీస్ ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను కోచ్లు ఓదారుస్తున్న వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. ఇది చూసిన చాలా మంది ఫ్యాన్స్ ఆమెకు ధైర్యం చెప్తూ పోస్టులు పెట్టారు.

ఆ తర్వాత కాంస్య పోరు కోసం వచ్చినప్పుడు కూడా అంతిమ్ ఆ ఓటమి బాధ నుంచి పూర్తిగా తేరుకున్నట్లు కనిపించలేదు. అంత బాధను అనుభవిస్తూ కూడా ఆమె అద్భుతంగా ఆడింది. సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో (World Championships) తొలి కాంస్యం తన ఖాతాలో వేసుకుంది. బెల్గ్రేడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో స్వీడిష్ రెజ్లర్ జోనా మాల్మ్గ్రెన్ను ఓడించింది.
రెండుసార్లు యూరోప్ ఛాంపియన్గా నిలిచిన జోనా కూడా అంతిమ్కు గట్టి పోటీ ఇచ్చింది. అయితే నెమ్మదిగా మ్యాచులో పట్టు బిగించిన అంతిమ్ (Antim Panghal).. జోనాకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచులో 16-6 తేడాతో ఘనవిజయం సాధించి కాంస్య పతకం అందుకుంది. అలాగే పారిస్ ఒలింపిక్స్లో బెర్తు కూడా ఖాయం చేసుకుంది.
ఈ పోటీలకు ముందు అంతిమ్ ఫిజికల్గా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆసియా క్రీడలు, వరల్డ్ ఛాంపియన్షిప్స్ రెండు టోర్నీల ట్రయల్స్లో పాల్గొనాల్సి వచ్చింది. దీని కోసం ఈ 53 కేజీల రెజ్లర్ బరువు బాగా తగ్గాల్సి వచ్చింది. ఇలా వేగంగా బరువు తగ్గడం వల్ల అంతిమ్కు చిన్న చిన్న గాయాలయ్యాయని కోచ్లు చెప్పారు.
ఇన్ని కష్టాలు పడినా కూడా ఆసియా గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ రెండు టోర్నీల్లో కచ్చితంగా పాల్గొనాలని అంతిమ్ నిర్ణయించుకుంది. మరో భారత రెజ్లర్ ఎవరూ కూడా ఈ రెండింటిలో పాల్గొనేందుకు సిద్ధ పడలేదు. ఈ టోర్నీలో మెడల్ సాధిస్తే పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశం ఉన్నందుకే అంతిమ్ (Antim Panghal) ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.