
దోహా: భారత అథ్లెట్ అన్నూరాణి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అదరగొట్టింది. మహిళల జావెలిన్ త్రోలో ఫైనల్కు చేరుకుంది. తద్వారా మహిళల జావెలిన్ త్రోలో ఫైనల్ రౌండ్కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా అన్ను రాణి చరిత్ర సృష్టించింది. అంతేకాదు జాతీయ రికార్డునూ తిరగరాసింది. సోమవారం దోహాలో జరిగిన గ్రూప్-ఎలోని క్వాలిఫికేషన్ రౌండ్లో జావెలిన్ను 62.43 మీ. దూరం విసిరి మూడో స్థానంలో నిలిచిన అన్ను రాణి తుది రౌండ్కు అర్హత సాధించింది.
ఈ క్రమంలోనే క్వాలిఫికేషన్ రౌండ్లో అన్ను రాణి మరో రికార్డు నెలకొల్పింది. గత మార్చిలో ఫెడరేషన్ కప్లో 62.34 మీ.తో తానే నెలకొల్పిన రికార్డును బద్దలుగొట్టింది. అయితే హీట్స్లో ఓవరాల్గా అన్ను ఐదో అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసింది. గ్రూప్ -ఎ ,గ్రూప్ -బి ఆటగాళ్లలో ఉత్తమ ప్రదర్శన చేసిన మొత్తం 12 మంది మంగళవారం జరిగే ఫైనల్కు అర్హత సాధించారు. అన్ను క్వాలిఫికేషన్ రౌండ్లోని తొలి రౌండ్లో జావెలిన్ను 57.05 మీటర్లను విసిరింది. రెండో రౌండ్లో ఏకంగా 62.43 మీటర్ల దూరం వేసింది. మూడో రౌండ్లో జావెలిన్ను 60.50 మీటర్ల దూరం విసిరి.. గ్రూప్-ఎలో మూడో స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో ఆసియా క్రీడల ఛాంపియన్ లియు షియింగ్ (63.48 మీ), రెండో స్థానంలో రాతేజ్ మార్టినా (62.87) ఉన్నారు.
మహిళల 200 మీ. పరుగులో భారత అథ్లెట్ అర్చనా సుశీంత్రన్ హీట్స్లోనే విఫలమైంది. 23.65 సెకండ్ల టైమింగ్తో గమ్యం చేరిన ఆమె ఎనిమిది మంది తలపడిన హీట్-2లో చివరి స్థానంలో నిలిచింది. మొత్తం 43 మందిలో సుశీంత్రన్ 40వ స్థానం సాధించింది. ఇక 400 మీ.లో అంజలీ దేవి కూడా హీట్స్లోనే వైదొలిగింది. హీట్-6లో 52.33 సెకన్ల టైమింగ్తో ఆమె ఆరో స్థానంలో నిలిచింది.
ప్రపంచ చాంపియన్షిప్లో జమైకా స్టార్ 'పాకెట్ రాకెట్' షెల్లీ అన్ ఫ్రేసర్ ప్రైస్ మరోసారి సత్తా చాటింది. బిడ్డకు జన్మనిచ్చినా తనలోని వేగం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో షెల్లీ 10.71 సెకన్లలో గమ్యానికి చేరి.. నాలుగోసారి 100 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్గా నిలిచింది. ఇక 10.83 సెకన్లలో 100 మీటర్లను పూర్తి చేసిన ఆషెర్ స్మిత్ (బ్రిటన్) రజతాన్ని, ఐవోరీకోస్ట్కు చెందిన మ్యారీ జోసీ (10.90సెకన్లు) కాంస్య పతకాన్ని గెలుచుకుంది.