
టోక్యో: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ 2021 జపాన్లో ఆరంభమైంది. ఆ దేశ కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రతిష్ఠాత్మకమైన ఈ స్పోర్ట్స్ ఈవెంట్ గ్రాండ్గా ప్రారంభమైంది. రాజధాని టోక్యో సహా ఎంపిక చేసిన నగరాల్లో ఈ ఈవెంట్స్ కొనసాగుతోన్నాయి. తొలిదశ అర్చరీ ఈవెంట్ కొనసాగుతోంది. మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో దీపికా కుమారి పాల్గొంటోన్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి ఆమె తొమ్మిదవ స్థానంలో నిలిచి, నిరాశ పరిచారు. ఈ రౌండ్లో కొరియాకు చెందిన యాన్ సాన్ రికార్డ్ నెలకొల్పారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులకు అనుమతివ్వట్లేదు జపాన్ ప్రభుత్వం. అభిమానులు లేకుండా ఈవెంట్స్ నడుస్తోన్నాయి. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు, అథ్లెట్లు, అధికారులు, సపోర్టింగ్ స్టాఫ్, మీడియా ప్రతినిధులు మాత్రమే గ్రౌండ్లో కనిపిస్తోన్నారు. ప్రేక్షకులు లేకపోవడం వల్ల ఒలింపిక్స్ కళ తప్పినట్టయింది. ఒలింపిక్స్ చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురు కాలేదు. కరోొనా వైరస్ దెబ్బకు స్టేడియాలన్నీ ఖాళీగా దర్శనమిస్తోన్నాయి. ఒలింపిక్ స్పోర్ట్స్ విలేజ్ సహా ఈవెంట్స్ జరిగే అన్ని ప్రాంతాల్లోనూ కోవిడ్ ప్రొటోకాల్స్ను పకడ్బందీగా అమలు చేస్తోన్నారు.
ఇప్పటికే కొందరు అథ్లెట్లు కరోనా బారిన పడటంతో.. దాన్ని నివారణ కోసం తీసుకునే చర్యల్లో జపాన్ ప్రభుత్వం ఏ మాత్రం రాజీపడట్లేదు. అయినప్పటికీ- క్రీడాభిమానులు మాత్రం ఒలింపిక్స్పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి వెనుకాడట్లేదు. ఒలింపిక్స్పై తమకు ఉన్న ఆసక్తిని వేర్వేరు రూపాల్లో ప్రదర్శిస్తోన్నారు. ఈ విషయంలో అథ్లెట్లు కూడా వెనక్కి తగ్గట్లేదు. పోలెండ్కు చెందిన హ్యామర్ ఛాంపియన్ అనిట వ్లొడార్క్జిక్.. డిఫరెంట్గా తన కళా నైపుణ్యాన్ని, ఒలింపిక్స్పై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.
ఒలింపిక్స్ను ప్రతిబింబించేలా గోళ్లపై పెయింట్ వేసుకున్నారు. ఒలింపిక్స్కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న జపాన్, తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న పోలెండ్ దేశాల పేర్లను గోళ్లపై పెయింట్తో రాసుకున్నారు. ఈ రెండు దేశాల జాతీయ పతాకాలను పెయింట్ చేశారు. అలాగే- ఒలింపిక్స్ లోగోను ముద్రించుకున్నారు. 2012, 2016 వరుస ఒలింపిక్స్ల్లో ఆమె హ్యామర్ ఛాంపియన్గా నిలిచారు. ఈ కేటగిరీలో రికార్డ్ నెలకొల్పారు. అది ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 82.98 మీటర్లను ఇప్పటికీ ఎవ్వరూ అధిగమించలేెకపోతోన్నారు. ఇలా వేర్వేరు రూపాల్లో అభిమానులు, అథ్లెట్లు.. ఒలింపిక్స్పై తమ మమకారాన్ని చాటుకుంటోన్నారు.