ముంబై: ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి అనంతరం టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను వాంఖేడే పిచ్ క్యురెటర్తో వాగ్వాదానికి దిగినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. క్యురేటర్ కూడా ధీటుగానే సమాధానమిచ్చాడు.
ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్.. రవిశాస్త్రికి వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తోంది. మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి వాంఖేడే క్యురేటర్ సుధీర్ నాయక్తో వాగ్వాదానికి దిగాడని తెలుస్తోంది.

మ్యాచ్ పూర్తి అయ్యాక రవిశాస్త్రి.. క్యూరేటర్తో 'గ్రేట్ వికెట్' అని ఎద్దేవా చేశాడు.దీనికి క్యురేటర్ సుధీర్ నాయక్ కూడా ఘాటుగానే స్పందించాడు. 'వికెట్ గురించి నాకు పాఠాలు వద్దు. నేను కూడా భారత్ తరఫున ఆడాను' అని సమాధానం ఇచ్చాడు.
రవిశాస్త్రి విషయాన్ని క్యురేటర్ ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై బిసిసిఐ అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. రవిశాస్త్రి వ్యాఖ్యల పైన ఎంసిఏ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై బిసిసిఐ దృష్టి సారించనుందని తెలుస్తోంది.