హైదరాబాద్: జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ ఆఖరి పరుగుకు సమయం ఆసన్నమైంది. లండన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్తో కెరీర్కు వీడ్కోలు పలకనున్న బోల్ట్ ఆఖరి పరుగుకు సిద్ధమయ్యాడు. శనివారం జరిగే 4* 100 రిలేతో పరుగుకు ఉసేన్ బోల్ట్ వీడ్కోలు పలకనున్నాడు.
ఈ మెగా ఈవెంట్లో 11 స్వర్ణాలు నెగ్గిన బోల్ట్ నేతృత్వంలోని జమైకా జట్టు శనివారం మధ్యాహ్నం 3:25 గంటలకు జరిగే హీట్స్లో ఫేవరెట్గా బరిలో దిగుతోంది. అయితే ఈసారి జమైకా జట్టుని ఓడించాలని అమెరికా పట్టుదలగా ఉంది. మంచి ఫామ్లో ఉన్న గాట్లిన్, కోల్మన్లతో అమెరికా బలంగా కనిపిస్తోంది.
'మిగతావాళ్లలానే మాకూ గెలిచే అవకాశముంది. ఈసారి గట్టి ప్రత్యర్థులం మేమే' అని కోల్మన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. మరోవైపు జమైకా జట్టులో బోల్ట్, యొహాన్ బ్లేక్ మినహా మిగతా వాళ్లు యువకులు కావడం విశేషం. '100 మీటర్ల పరుగులో విఫలమైనందుకు బాధగా ఉంది. ప్రస్తుతం మా దృష్టి రిలే స్వర్ణంపైనే' అని బోల్ట్ చెప్పాడు.
బోల్ట్ నేతృత్వంలోని జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తే శనివారం అర్ధరాత్రి అంటే భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2:20 ఫైనల్ జరుగుతుంది. ఈ రేస్లో జమైకా జట్టు విజయం సాధిస్తే బోల్ట్ ఖాతాలో 12వ స్వర్ణం చేరుతుంది. రిలేలో ప్రపంచ రికార్డు జమైకా జట్టు పేరిట ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్లో 36.84 సెకన్లలో ఆ జట్టు స్వర్ణం గెలిచింది.
బోల్ట్ ఆఖరి పరుగు:
4*100 మీటర్ల రిలే
హీట్స్: మధ్యాహ్నం 3.25కు
ఫైనల్: రాత్రి 2.20కి
స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్-2లో ప్రసారం