న్యూఢిల్లీ: టీమ్ ఇండియాకు ఆడాలన్న హైదరాబాదీ అంబటి తిరుపతి రాయుడు చిరకాల వాంఛ త్వరలోనే నెరవేరనుంది. వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే వన్డే సిరీస్ కు సీనియర్లు దూరం కానున్న నేపథ్యంలో రాయుడుతో పాటు మరికొందరు యువ ఆటగాళ్లు భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశముంది. సెహ్వాగ్ భుజం గాయంతో ఇప్పటికే వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. ధోనీ, సచిన్ , జహీర్ లు కూడా వన్డేలకు దూరంగా ఉండి, టెస్టు సిరీస్ లో ఆడాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రంజీ సీజన్లో రాణించి, ఐపీఎల్ -4లో అదరగొడుతున్న రాయుడికి జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వికెట్ కీపింగ్ కూడా చేయగలగడం అతనికున్న మరో సానుకూలాంశం. తమిళనాడు ఆటగాడు బద్రీనాథ్ కూడా జట్టులోకి రావచ్చు. పుణె తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న రాహుల్ శర్మ లెగ్ స్పిన్నర్ కోటాలో చోటు దక్కించుకోవచ్చు. సచిన్ టెండూల్కర్ తో కలిసి ఐపియల్ లో ఆడడం రాయుడికి కలిసొచ్చిందనే చెప్పాలి.