న్యూఢిల్లీ: వచ్చే నెలలో రియోలో జరగనున్న ఒలింపిక్స్కు భారత్ నుంచి అర్హత సాధించిన ఆటగాళ్లది ఒక్కొక్కరిదీ ఒక్కో గాధ. అవతార్ సింగ్... ఈ ఏడాది భారత్ తరుపున రియో ఒలింపిక్స్లో పాల్గొంటున్న ఏకైక జూడో క్రీడాకారుడు. రియోలో ఆగస్టు 10న జరిగే 90 కేజీల వెయిట్ కేటగిరీలో ప్రదర్శన ఇవ్వనున్నాడు.
ఇప్పటి వరకు అంతర్జాతీయ పలు జూడో ప్రదర్శనల్లో పాల్గొన్న అవతార్ సింగ్.. తొలిసారిగా భారత్ తరుపున ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. అవతార్ సింగ్ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న కారణంతో ఇప్పటిదాకా తన కొడుకు ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించలేదు.
కేవలం టీవీలో మాత్రమే తన కుమారుడి ప్రదర్శనను వీక్షించేవాడు. కానీ ఈసారి తన కుమారుడు ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం లభించడంతో తాను కూడా కుమారుడి ప్రదర్శనను వీక్షించేందుకు ఆర్ధిక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. అవతార్ సింగ్ను ప్రభుత్వం తన ఖర్చులతో రియో ఒలింపిక్స్కు పంపిస్తోంది.

అయితే అవతార్ సింగ్ తండ్రి సింగారా సింగ్ కుమారుడి వెంట రియో ఒలింపిక్స్ జరిగే బ్రెజిల్కు వెళ్లాలంటే మాత్రం లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని కోసం అవతార్ సింగ్ ఆర్ధిక సహాయం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో అదృష్టవశాత్తు వీరికి చేయూత అందించేందుకు Milaap.org అనే వెబ్ సైట్ ముందుకు వచ్చింది.
అవతార్ తల్లిదండ్రులకు ఈ పర్యటనకు అయ్యే ఖర్చు రూ.8 లక్షల కోసం విరాళాలను సేకరించాలని నిర్ణయించింది. రియో ఒలింపిక్స్లో అవతార్ తల్లిదండ్రులు ఉండేందుకు గాను హోటల్ చార్జీలు, వీసా ఫీజులు, రోజు వారీ ఖర్చుల నిమిత్తం ఈనెల 31 వరకు ఆ ఖర్చులకు అవసరమైన విరాళాలు అందుతాయని వెబ్సైట్ యాజమాన్యం ఆశిస్తున్నారు.
గురుదాస్ పూర్కు చెందిన అవతార్ తండ్రి సింగార్ సింగ్ స్థానిక ఆస్పత్రిలో చిన్నస్థాయి ఉద్యోగి. తల్లి గృహిణి. ఆదాయం కూడా చాలా తక్కువ. ఇప్పటిదాకా కుమారుడి విదేశీ ప్రయాణాల ఖర్చుల కోసం అప్పు చేసి మరీ డబ్బు అందించాడు. కానీ మొట్టమొదటి సారి ఒలింపిక్స్లో తన కుమారుడి ప్రదర్శనను చూసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.