దేశ క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఈ ఏడాది నామినీల నుంచి కేంద్రం పేర్లు ఆహ్వానించింది. అయితే ఇందులో ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ తో సత్తా చాటుకున్న షూటర్ మనూ భాకర్ ను ఖేల్ రత్న అవార్డుకు పరిగణనలోకి తీసుకోకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తన కుమార్తె ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు దరఖాస్తు చేసుకుందని ఆమె తండ్రి ఓవైపు చెప్తుంటే కేంద్రం మాత్రం తన వద్దకు నామినేషన్ రాలేదని చెప్పడం మొత్తం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీల జాబితాలో డబుల్ ఒలింపిక్ పతక విజేత, షూటర్ మను భాకర్ పేరు లేకపోవడం వివాదాస్పదమైన నేపథ్యంలో కేంద్రం తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించడం ద్వారా ఆమె పేరును దేశ అత్యున్నత క్రీడా గౌరవానికి నామినేట్ చేయాలని నిర్ణయించింది. ఖేల్ రత్న నామినేషన్ల పేర్లను కేంద్రం ఇప్పటివరకూ బయటపెట్టకపోయినా మీడియాలో జరుగుతున్న చర్చ మాత్రం క్రీడాశాఖకు తలనొప్పిగా మారింది.

ఖేల్ రత్న కోసం సిఫార్సు చేసిన అథ్లెట్ల జాబితా నుండి మనూభాకర్ ను తొలగించడంపై టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. దీంతో మొదలైన వివాదం కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. కేంద్రం తీరుపై అన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ కొట్టాక కూడా తన కుమార్తెను ఇలా ట్రీట్ చేస్తారా అంటూ మనూభాకర్ తండ్రి వేసిన ప్రశ్న కేంద్రాన్ని ఇరుకునపెట్టింది. దీంతో సుమోటోగా మనూభాకర్ పేరును ఖేల్ రత్న అవార్డుల జాబితాలోకి తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్తో కలిసి పతకాలు సాధించిన మనూభాకర్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్ క్రీడలలో అత్యుత్తమ భారతీయ అథ్లెట్లలో ఒకరిగా మనూ రికార్డుల్లోకి ఎక్కింది. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల మనూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఒకే ఒలింపిక్ ఈవెంట్ లో ఇలా రెండు మెడల్స్ సాధించిన ఏకైక క్రీడాకారిణిగా నిలిచింది.