Reetika Hooda: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మరో పతకాన్ని సాధించింది. 57 కేజీల పురుషుల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ ప్యూర్టోరికోకు చెందిన డారియన్ టాయ్ క్రూజ్ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఒలింపిక్స్ రెజ్లింగ్లో కాంస్యాన్ని సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన రెజ్లర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఇప్పుడు రెజ్లింగ్లోనే మరో హైఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. భారత మహిళా రెజ్లర్ రీతికా హుడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 76 కేజీల ఫ్రీ-స్టైల్ కేటగిరీలో ఆమె పోటీ పడనున్నారు. ఇంకాస్సేపట్లో రౌండ్ 16 గేమ్లో గట్టి ప్రత్యర్థితో తలపడనున్నారు. ఈ బౌట్లో గెలిస్తే పతకానికి చేరువ అయినట్టే.

ఈ మధ్యాహ్నం 2:51 నిమిషాలకు బౌట్ మొదలవుతుంది. రౌండ్ 16లో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగితో తలపడనున్నారు. మహిళల రెజ్లింగ్లో మరో పతకం దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. రితికా హూడా ప్రస్తుతం ఫుల్ ఫామ్లో కొనసాగుతుండటమే దీనికి ప్రధాన కారణం.
2023లో రెండు పతకాలను అందుకున్నారు రితికా. వరల్డ్ అండర్ 23 ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో ఏకంగా బంగారు పతకాన్ని ముద్దాడారు. అదే ఏడాది జరిగిన ఆసియన్ ఛాంపియన్షిప్లో రజతాన్ని సాధించారు. ఇప్పుడు అదే ఊపును పారిస్ ఒలింపిక్స్లో కొనసాగిస్తారనే అంచనాలు ఉన్నాయి.
బెర్నాడెట్ నాగి కూడా.. అల్లాటప్పా రెజ్లరేమీ కాదు. ఈ ఏడాది రొమానియాలోని బుకారెస్ట్లో జరిగిన యూరోపియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని అందుకుంది. ఫ్రాన్స్కు చెందిన పాలైన్ లెకార్పెంటియెర్ను ఓడించింది. ఏప్రిల్లో అజర్బైజన్లోని బాకూలో జరిగిన యూరోపియన్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో మూడు వరుస బౌట్లల్లో ప్రత్యర్థిని మట్టికరిపించింది.