షార్జా: ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు మొహమ్మద్ షాహ్జద్.. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్కి పెద్ద అభిమాని. కాగా, జింబాబ్వే జట్టుతో జరిగిన ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచులో 118పరుగులు చేసి నాలుగో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు షాహ్జద్.
27ఏళ్ల ఈ ఆఫ్ఘాన్ ఓపెనర్ 52 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ధోనీ షాట్లను అనుకరించే షాహ్జద్ను ముద్దుగా ఎంఎస్ అని పిలుచుకుంటారు అతని జట్టు సభ్యులు. కాగా, ధోనీకి పెద్ధ అభిమాని అయిన షాహ్జద్, అతనికి మంచి స్నేహితుడు కూడా.
67బంతులాడిన షాహ్జద్ మొత్తం 10బౌండరీలు చేశాడు. అంతేగాక, రెండు వారాల క్రితం జింబాబ్వేతో జరిగిన వన్డేలో కూడా 131 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కాగా, గత అక్టోబర్లో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ను 3-2 తేడాతో ఆఫ్ఘాన్ జట్టు గెలుచుకుంది.
గత జనవరిలో వెస్టిండీస్తో జోహన్నెస్బర్గ్లో జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికా ఆటగాడు ఫఫ్ డుప్లిసిస్ 119 పరుగులు చేయగా, ప్రస్తుతం ఈ ఆఫ్ఘాన్ ఆటగాడు షాహ్జద్ 118 పరుగులతో అతని తర్వాత స్థానంలో నిలిచాడు.
'షార్జా నా అభిమాన మైదానం. ఇక్కడ ఆడటమంటే నాకు చాలా ఇష్టం. ఎలాంటి ప్రణాళిక లేదు. వచ్చిన ప్రతీ బంతినీ బౌండరీ బాదేయాలని అనుకున్నా. అలాగే చేశా. నేను కెప్టెన్తో మాట్లాడా. 150 పరుగులు జింబాబ్వేకు సరిపోతాయని భావించాం' అని షాహ్జద్ తెలిపాడు.
'జింబాబ్వేతో జరిగిన నాలుగో సిరీస్ను కూడా మేం గెలుచుకున్నాం' అని ఆఫ్ఘానిస్థాన్ జట్టు కెప్టెన్ అస్ఘర్ స్టనిక్జాయ్ తెలిపాడు. జట్టు ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పిన అస్ఘర్.. వచ్చే పదేళ్లలో ఏ జట్టునైనా చిత్తు చేసే శక్తిగా తయారవుతామన్నారు. కాగా, షాహ్జద్ బ్యాటింగ్ అద్భుతమని, తమ వద్ద ఎలాంటి జవాబు లేదని జింబాబ్వే కెప్టెన్ ఎల్టన్ చిగుంబర తెలిపాడు.