
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత, ఏస్ ఇండియన్ షూటర్ మను భాకర్ దేశ రాజధాని ఢిల్లోలోని ప్రఖ్యాత లేడీ శ్రీరామ్ కళాశాల (ఎల్ఎస్ఆర్)లో ప్రవేశం పొందింది. అక్కడ మను రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్)ను అభ్యసించనుంది. హర్యానాకు చెందిన 17 ఏళ్ల మను స్పోర్ట్స్ కోటా కింద అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఎలాంటి అర్హత పరీక్షలు రాయకుండానే స్పోర్ట్స్ కోటా కింద మను భాకర్ ఎల్ఎస్ఆర్ కళాశాలలో సీటు దక్కించుకుంది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
నిబంధనల ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద ఎంట్రన్స్ పరీక్షలు లేకుండానే నేరుగా చేరే అవకాశం ఉంది. కామన్వెల్త్ గేమ్స్, యూత్ ఒలింపిక్స్లో స్వర్ణాలు నెగ్గిన భాకర్.. మ్యూనిచ్ వేదికగా జరిగిన షూటింగ్ ప్రపంచకప్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో 2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
'ఢిల్లీకి చెందిన ప్రతిష్టాత్మక లేడీ శ్రీరామ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ విభాగంలో ప్రవేశం పొందిన యువ షూటింగ్ ఛాంపియన్ మనుకు అభినందనలు. మా టాప్ అథ్లెట్ కామన్వెల్త్ గేమ్స్, వివిధ ప్రపంచకప్లో బంగారు పతకాలు సాధించింది. అంతేకాదు టోక్యో 2020 ఒలింపిక్స్ కోసం అర్హత సాధించింది' అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది.