హైదరాబాద్: ఇండియన్ ఒలింపిక్స్ సంఘం (ఐవోఏ)ను సస్పెండ్ చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా సమర్ధించాడు. ఐవోఏ పట్ల క్రీడాశాఖ తీసుకున్న నిర్ణయం మంచి పరిణామానికి సంకేతమని బింద్రా అభిప్రాయపడ్డాడు.
క్రీడల్లో పారదర్శకత ఉండాలంటే ఇలాంటి నిర్ణయాలు అవసరమని అభిప్రాయపడ్డాడు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ వేసిన ముందడుగు కొన్ని విలువల్ని కాపాడటానికి దోహదం చేస్తుందని పేర్కొన్నాడు. ఎక్కడైనా అవినీతి కూడిన పరిపాలన ఎంతోకాలం సాగదనడానికి ఇదే ఉదాహరణ అని బింద్రా తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.
ఢిల్లీ 2010 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన వేల కోట్ల అవినీతి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను ఇటీవలే ఐవోఏ జీవితకాల అధ్యక్షులుగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని క్రీడా శాఖ డిమాండ్ చేసినా దానిని ఐవోఏ పక్కన పెట్టేసింది.

దీంతో కళంకితులను ఉన్నత పదవుల్లో ఎలా కూర్చోబెడతారంటూ క్రీడల శాఖ ఐవోఏకి నోటీసు జారీ చేసింది. క్రీడాశాఖ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బదులు ఇవ్వనుందుకు గాను ఐవోఏను సస్పెండ్ చేసినట్లు కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ ఓ ప్రకటన చేశారు. కామన్వెల్త్ దోషులు సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాల నియామకాలను రద్దు చేసేవరకు ఇది అమల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
'తప్పుడు నిర్ణయాలను ప్రభుత్వం ఎప్పుడూ సమర్థించదు. చాలా సీరియస్ అంశంపై మేం ఐవోఏకు షోకాజ్ నోటీసు జారీ చేశాం. దానిపై స్పందించకుండా 15 రోజులు గడువు కావాలని కోరారు. ఇది సరైంది కాదు. అందుకే సస్పెండ్ చేశాం. కల్మాడీ, చౌతాల నియామకాలు రద్దు చేసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుంది' అని ఆయన వెల్లడించారు.