బెంగుళూరు: ప్రపంచ వన్డే క్రికెట్లో విధ్యంసకర బ్యాట్స్మెన్గా పేరుగాంచిన దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాడు ఏబీ డివిల్లీర్స్ అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. ఇప్పటి వరకు తన కేరీర్లో 99 టెస్టు మ్యాచ్లాడిన డివిల్లీర్స్ ఫ్రీడమ్ సిరిస్లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య బెంగుళూరులో జరిగే టెస్టు మ్యాచ్తో 100వ టెస్టు మ్యాచ్ల క్లబ్లోకి చేరనున్నాడు.
ఈ అరుదైన రికార్డుని అందుకున్న ఏడో దక్షిణాఫ్రికా ఆటగాడిగా చరిత్రకెక్కనున్నాడు. ఏబీ డివిల్లీర్స్ కంటే ముందు దక్షిణాఫ్రికా జట్టు తరుపున కల్లిస్ (165), మార్క్ బౌచర్ (146), గ్రేమ్ స్మిత (116), షాన పొలాక్ (108), గారీ కిర్స్టెన్ (101), మకాయ ఎన్తిని (101) ఈ ఘనతను అందుకున్నారు.
2004 డిసెంబర్లో పోర్ట్ ఎలిజిబెత్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఏబీ డివిల్లీర్స్ (31) టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తన తొలి టెస్టు మ్యాచ్లో 28, 14 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఓడింది.
తాను ఆడిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్పైనే తొలి సెంచరీ సాధించాడు. 2008లో అహ్మదాబాద్లో జరిగిన టెస్టు మ్యాచ్లో 217 పరుగులతో అజేయంగా నిలిచి, తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 2010లో పాకిస్థాన్పై అబుదాబిలో జరిగిన టెస్టు మ్యాచ్లో 33/3తో కష్టాల్లో ఉన్న దక్షిణాఫ్రికాకు విజయం సాధించిపెట్టాడు.
తక్కువ బంతుల్లో సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా డివిల్లీర్స్ పేరుగాంచాడు. 2010లో సెంచూరియన్ పార్క్లో భారత్పై 112 బంతుల్లో 129 పరుగులు, డర్బన్ టెస్ట్లో వెస్టిండిస్పై 109 బంతుల్లో 103 నాటౌట్, 2012లో పెర్త్లో ఆస్టేలియాపై 184 బంతుల్లో 169 పరుగులు ఏబీ కెరీర్లో ముఖ్యమైనవి.
ఇప్పటివరకు 99 టెస్టు మ్యాచ్లాడిన ఏబీ డివిల్లీర్స్ 51.92 సగటుతో 7685 పరుగులు సాధించాడు. అందులో 21 సెంచరీలు ఉన్నాయి. డివిల్లీర్స్ సెంచరీలు సాధించిన టెస్టు మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా అత్యధిక విజయాలు సొంతం చేసుకుంది. క్రికెట్ కెరీర్లో వంద టెస్టు మార్కుని చేరుకున్న ఆటగాళ్లు ఆ మ్యాచ్లో అధ్భుతంగా రాణించారు.
పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ మియాందాద్ వందో టెస్ట్లో భారతపై 145 పరుగులు చేశాడు. భారత్పై తన వందో టెస్టును ఆడిన పాక్ ఆటగాడు ఇంజమామ్ హక్ 184 పరుగులు సాధించాడు. ఆస్టేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ అయితే రెండు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు నమోదు చేశాడు.
వీరితో పాటు స్టివార్ట్, గ్రేమ్ స్మిత్, కౌడ్రే లాంటి దిగ్గజ ఆటగాళ్లు మూడంకెల స్కోరును సాధించారు. ఇక బౌలర్లలో ఆస్టేలియా మాజీ దిగ్గజం షేన్ వార్న్ వందో టెస్టులో 8 వికెట్లు తీసుకోగా, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు.