హైదరాబాద్: 734 మంది యువతీయువకులు 'ఖేలో ఇండియా టాలెంట్ డెవలప్మెంట్ స్కీమ్' స్కాలర్షిప్ ప్రోగ్రామ్కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ) ఎంపిక చేసింది. ఈ మేరకు వివిధ క్రీడల్లో ప్రతిభావంతులను కమిటీ ఎంపిక చేసింది. అర్జున అవార్డ్ గ్రహీతలు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు అయిన వివిధ క్రీడా నిపుణులతో ఏర్పడిన కమిటీ మొత్తం 734 మందిని ఎంపిక చేసి వారి జాబితాను హై పవర్ కమిటీకి అందజేసింది. ఆ కమిటీ కూడా తమ ఆమోద ముద్ర వేసింది.
లోకల్ టోర్నమెంట్స్లో పాల్గొనేందుకు వారి ప్రయాణ ఖర్చులతో పాటు తోడుగా వచ్చే వారి ఖర్చులను కూడా క్రీడాకారులు పొందవచ్చు. ఈ శిక్షణకు ఎంపిక అయిన క్రీడాకారులు ఎస్ఏఐ అకాడమీలతో పాటు, ప్రైవేట్, స్టేట్ అకాడమీల్లో కూడా శిక్షణ పొందవచ్చు. మొత్తం 21 నాన్-ఎస్ఏఐ అకాడమీల్లో కూడా శిక్షణను తీసుకోవచ్చు. ఈ అకాడమీల జాబితాను ఎస్ఏఐ వెబ్సైట్లో చూడవచ్చు.
ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కు ఎంపిక అయిన వారి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, వసతి, టోర్నమెంట్స్లో పాల్గొనేందుకు సంబంధించిన ఖర్చులు, ఇతర ఖర్చులను కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భరిస్తుంది. ఎంపిక అయిన అభ్యర్థులు ఏడాదికి 1.2 లక్షల రూపాయల స్కాలర్షిప్ను పొందుతారు. నాలుగు నెలలకు ఒకసారి చెల్లింపులు జరుగుతాయి. ఎంపికైన యువతీయువకులు ఆటలో భాగంగా గాయాల పాలైనా వారి బాధ్యతను ఎస్ఏఐ చూసుకుంటుంది.
ఇంకా ఈ పథకం ద్వారా ప్లేయర్లు సుదూర ప్రయాణాలు చేయడం మానేసి మనకు దగ్గర్లోనే క్రీడలను ఆడే విధంగా లబ్ధి పొందనున్నారు. ఆటగాళ్లు సమృద్ధిగా దొరికిన చోటే ఆటలోని నైపుణ్యం, ప్రతిభ కూడా మెరుగవుతాయని నిర్వహకుల అభిప్రాయం.