న్యూఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టులో అజింక్య రహానే సెంచరీ సాధించి అరుదైన రికార్డు పొందాడు. ఒక టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో సెంచరీ సాధించిన ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు.
గతంలో ఈ రికార్డును సునీల్ గవాస్కర్ మూడుసార్లు, రాహుల్ ద్రవిడ్ రెండుసార్లు, విజయ్ హజారే, విరాట్ కోహ్లీలు ఒక్కోసారి సాధించారు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో రహానే 127 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో 206 బంతులాడి ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు.
మరోవైపు, అంపైర్ నిర్ణయం పట్ల అసమ్మతి తెలిపినందుకు విరాట్ కోహ్లి, విజయ్లు ఐసీసీ నుంచి క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొనే అవకాశముంది. ఈ ఇద్దరి విషయంలోనూ అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని తేలింది.

కానీ కోహ్లి అదృష్టంకొద్దీ బతికిపోయి బ్యాటింగ్ కొనసాగించగా, విజయ్ మాత్రం అంపైర్ తప్పిదానికి బలయ్యాడు. భారత్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో మోర్నీ బౌన్సర్కు విజయ్ వికెట్ల వెనుక క్యాచ్ ఔటైనట్లు అంపైర్ ధర్మసేన ప్రకటించాడు. విజయ్ మాత్రం బంతి ఆర్మ్ గార్డ్ను తగిలిందని చూపించాడు.
అతడు సరిగానే చెప్పాడు కానీ, అంపైర్కు అలా సంజ్ఞలు చేయడం నిబంధనలకు విరుద్ధమే. ఇక ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తాహిర్ బౌలింగ్లో కోహ్లి క్యాచ్ ఔటైనట్లు అంపైర్ ఆక్సెన్ఫోర్డ్ ప్రకటించాడు. తాహిర్ లెగ్బ్రేక్ను కోహ్లి బ్యాక్ఫుట్పై సరిగా ఆడలేకపోవడంతో బంతి వికెట్ కీపర్ చేతుల్లో పడింది.
అంపైర్ వేలెత్తినా వెళ్లిపోకుండా కోహ్లి కొద్దిసేపు అంపైర్ వైపు కోపంగా చూశాడు. ఆ తర్వాత అసంతృప్తితో తల ఊపుతూ పెవిలియన్కు నడక ప్రారంభించాడు. ఐతే తాహిర్ నోబాల్ వేశాడేమోనన్న అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు కోహ్లిని అంపైర్ ఆపాడు. తాహిర్ నోబాల్ వేసినట్లు తేలడంతో కోహ్లి తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. నిజానికి బంతి కోహ్లి బ్యాట్కు తగల్లేదని కూడా రీప్లేల్లో తేలింది.