దోహా: ప్రస్తుతం ఖతార్ రాజధాని దోహలో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అథ్లెటిక్స్ ఛాంప్స్లో అరుదైన రికార్డు నమోదయింది. పోర్చుగల్ అథ్లెట్ జోవావీరా సంచలనం సృష్టించాడు. జోవావీరా 43 ఏళ్ల వయస్సులో పతకం సాధించి.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో లేటు వయస్సులో పతకం సాధించిన తొలి అథ్లెట్గా నిలిచాడు. శనివారం రాత్రి జరిగిన పురుషుల 50 కిలోమీటర్ల నడక పోటీలో 4 గంటల 20 నిముషాలు నడిచి జోవావీరా రజతం సాధించాడు.
స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీలకే సాధ్యం కాలేదు.. టీ20లో నేపాల్ కెప్టెన్ సరికొత్త రికార్డు!!
50 కిలోమీటర్ల నడక పోటీలో జపాన్కి చెందిన యుసుకె సుజుకి స్వర్ణం సాధించగా.. జోవా వీరా రజతం గెలుచుకున్నాడు. ఇక కెనడాకి చెందిన ఇవాన్ డన్ఫీ మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం దోహాలో ఎండలు మండుతున్న కారణంగా అథ్లెట్లు వేడిని తట్టుకోలేకపోతున్నారు. పరుగు, నడక, మారథాన్ పోటీలను అర్ధరాత్రి నిర్వహిస్తున్నా.. కొందరు అథ్లెట్లు మధ్యలోనే ఆగిపోతున్నారు. కానీ.. 43 ఏళ్ల జోవావీరా అవేమీ లెక్కచేయకుండా బరిలోకి దిగి పతకం గెలవడం విశేషం.
1999 నుంచి ప్రతీ ఛాంపియన్షిప్లో జోవావీరా పాల్గొంటున్నాడు. ఇప్పటివరకు అతడు 11సార్లు ఛాంపియన్షిప్ ఈవెంట్లలో పాల్గొన్నాడు. అయితే 11 సార్లు పోటీలో పాల్గొన్నా.. జోవావీరా పతకం సాధించడం ఇదే తొలిసారి. వయసు పెరుగుతున్నా పట్టువిడవని జోవావీరా పతకం సాధించడం ఎందరికో స్ఫూర్తి అని క్రీడా పండితులు అంటున్నారు. ప్రస్తుతం ఈ పోర్చుగల్ అథ్లెట్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
పతకం తీసుకున్న అనంతరం జోవావీరా మాట్లాడుతూ... 'దేశం కోసం పతకం సాధించాలని ఎప్పటినుండో అనుకుంటున్నా. ఇప్పుడు అది సాధ్యమైంది. 43 ఏళ్ల వయస్సులో పతకం సాధించడం సంతోషంగా ఉంది. ఈ పోటీ నరకంలా అనిపించింది. అధిక ఉష్ణోగ్రతలతో సతమతమయ్యా' అని అన్నాడు. 'ప్రతిరోజు మంచి వాతావరణంలో సాధన చేయడం వల్లే నా కల సాకారమైంది. ఏది చేసినా సంతోషంగా చేస్తా. దేశానికి కృతజ్ఞతలు' అని జోవావీరా పేర్కొన్నాడు.