ప్రతిష్టాత్మక 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ వేదికగా ఇటీవలే అంగరంగ వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నేషనల్ గేమ్స్ లో తెలుగు రాష్ట్రాలు పతకాల బోణీ కొట్టాయి. వెయిట్ లిఫ్టింగ్లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన లిఫ్టర్ కె.నీలం రాజు గోల్డ్ మెడల్ సాధించగా.. సైక్లింగ్లో తెలంగాణకు చెందిన ఆశీర్వాద్ సక్సేనా బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు.
అగ్రస్థానంలో నీలం రాజు
పురుషుల 67 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో నీలం రాజు మొత్తం 289 కేజీలు బరువెత్తి అగ్ర స్థానంలో నిలిచాడు. స్నాచ్లో 128 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 161 కేజీలు ఎత్తి.. పసిడిని ముద్దాడాడు. మహిళల 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మణిపుర్ కు చెందిన స్టార్ లిఫ్టర్ బింద్యా రాణి దేవి మొత్తం (88+113) 201 కేజీల బరువెత్తి బంగారు పతకాన్ని గెలిచింది. స్నాచ్లో 88 కేజీలు బరువెత్తి జాతీయ రికార్డు నెలకొల్పింది. గతంలో మీరాబాయి చాను ఈ విభాగంలో 86 కేజీల బరువెత్తింగి. ఇప్పుడు ఆ రికార్డును బింద్యారాణి బ్రేక్ చేసింది.

హైదరాబాదీ సైక్లిస్ట్
పురుషుల విభాగంలో 120 కిలోమీటర్ల సైక్లింగ్ రోడ్ రేస్ మాస్ స్టార్ట్ ఈవెంట్ లో ఆశీర్వాద్ సక్సెనా మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ రేసును 2 గంటల 48 నిమిషాల 39.029 సెకన్లలో పూర్తి చేసి కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దినేశ్ 2 గంట 48 ని 28.509 సె- సర్వీసెస్ పూర్తి చేసి స్వర్ణం దక్కించుకున్నాడు. సాహిల్ కుమార్ 2 గంట 48 ని 28.730 సెసర్వీసెస్ కంప్లీట్ చేసి సిల్వర్ మెడల్ ను ముద్దాడాడు.