అక్టోబర్ 20 నుంచి 28 వరకు
అక్టోబర్ 20 నుంచి 28 వరకు జరగనున్న ఈ రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్షిప్కు హంగేరీలోని బుడాపెస్ట్ నగరం ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రీస్టయిల్, గ్రెకోరోమన్, మహిళల రెజ్లింగ్ కేటగిరిలలో 10 మది సభ్యులతో కూడిన జట్టును రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్) ఎంపిక చేసింది.
65 కేజీలు ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీ పడనున్న భజరంగ్
భజరంగ్ పూనియా(65 కేజీలు) ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ తరఫున అత్యుత్తమంగా ఎంపిక చేయగా, సాక్షి మాలిక్(62 కేజీలు), కామన్వెల్త్ గోల్డ్మెడలిస్ట్ పూజా దండా(57 కేజీలు) మహిళా జట్టులో అత్యుత్తమ ఎంపికగా ఫెడరేషన్ పేర్కొంది. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో పాల్గొనే 30 మంది రెజ్లర్లతోపాటు 17 మంది అధికారులు, కోచ్లు, ఫిజియోధెరపిస్టులు, రిఫరీలు ఉన్నారు.
మహిళల జట్టుకు ఇన్చార్జిగా కుల్దీప్ మాలిక్
ఇక, పురుషుల ఫ్రీస్టయిల్ విభాగానికి జమీందర్ సింగ్ చీఫ్ కోచ్గా, మహిళల జట్టుకు కుల్దీప్ మాలిక్ ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. వీరంతా పోటీలు జరిగే బుడాపెస్ట్కు మంగళవారం పయనమయ్యారు. మహిళల విభాగంలో గాయపడిన వినేష్ ఫొగట్ స్థానంలో ఆమె సోదరి రీతూ ఫొగట్ పోటీల్లో పాల్గొననుంది.
ఆసియా గేమ్స్ కంటే ఎక్కువ పతకాలు సాధిస్తాం
కాగా, మహిళల విభాగంలో తమ జట్టులోని సభ్యులంతా బాగా సన్నద్ధమయ్యారని, గడిచిన ఆసియా గేమ్స్ కంటే ఎక్కువ పతకాలు సాధిస్తారనే గట్టి నమ్మకం ఉందని ఆ జట్టు చీఫ్ కోచ్ కుల్దీప్ మాలిక్ అన్నాడు. అదేవిధంగా పురుషుల జట్టు చీఫ్ కోచ్ జమీందర్ సింగ్ సైతం తమ జట్టు సభ్యులు తప్పకుండా పతకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.