
హైదరాబాద్: వాలీబాల్ క్రీడాకారుడి మృతి హర్యానాలోని హిస్సార్ జిల్లా వ్యాప్తంగా విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడాకారుడిని కాల్చి చంపారు. సిస్వాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్దీప్ (25)అనే వాలీబాల్ ప్లేయర్ మైదానంలో ఆట ముగించుకుని నిన్న రాత్రి 10 గంటలకు బైకుపై ఇంటికి తిరిగొస్తున్నాడు. వీధి లైట్లు లేని నిర్మానుష్య ప్రాంతానికి సమీపించగానే హఠాత్తుగా చుట్టుముట్టిన ఆగంతుకులు అతనిపై వరుస కాల్పులు జరిపారు.
దీంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాల్పుల్లో తీవ్రగాయాలతో కుల్దీప్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హిస్సార్ జిల్లాలోని ఆదంపూర్ స్టేషన్ సమీపంలో సుమారు పది గంట సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. కుల్దీప్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణుల టీం సాయంతో దర్యాప్తును ప్రారంభించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేశాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిస్సార్ స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన విధానంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో.. విచారణను వేగవంతం చేశామని పోలీసులు తెలిపారు.