హామిల్టన్: న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో భారత్ పూర్తి ఆధిపత్యం సాధించింది. భారత్ ఆలవుట్ అయిన తర్వాత రెండో ఇన్నింగ్సు ప్రారంభించిన న్యూజిలాండ్ పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్టును కోల్పోయింది. జహీర్ ఖాన్ న్యూజిలాండ్ తొలి వికెట్ ను తీసి భారత్ కు శుభారంభాన్ని అందించాడు. జహీర్ వేసిన బంతి మికింతోష్ బ్యాట్ ను ముద్దాడుతూ టెండూల్కర్ చేతిలోకి వెళ్లిపోయింది. ఈ క్యాచ్ పట్టిన సమయంలో టెండూల్కర్ వేలికి దెబ్బ తగిలింది. ఈ వికెట్ ను కూల్చడంతో జహీర్ ఖాన్ 200 వికెట్లు తీసిన ఏడో భారత బౌలరుగా రికార్డుల్లోకి ఎక్కాడు. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్సులో 520 పరుగులకు అలవుట్ అయింది. జహీర్ ఖాన్ 45 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఇది టెస్టుల్లో జహీర్ కు మూడో అర్థ సెంచరీ. ఈ అర్థ సెంచరీలో 8 ఫోర్లు ఉన్నాయి. మునాఫ్ పటేల్ ను 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెట్టోరీ అవుట్ చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్సు ముగిసింది. భారత్ న్యూజిలాండ్ పై 241 పరుగుల తొలి ఇన్నింగ్సు ఆధిక్యతను సాధించింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 160 పరుగులు చేశాడు. ఇందులో 26 ఫోర్లు ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోని 429 పరుగుల వద్ద 47 పరుగులు చేసి అవుటయ్యాడు. ధోనీతో కలిసి టెండూల్కర్ 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెస్టుల్లో మ్యాచుల్లో టెండూల్కర్ 42 సెంచరీలు సాధించినట్లయింది. యువరాజ్ సింగ్ 22 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆయన 22 పరుగుల్లో నాలుగు ఫోర్లు ఉన్నాయి.