హైదరాబాద్: తండ్రితో మాట్లాడి ఆ వెను వెంటనే ఫాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో చోటు చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన 18 ఏళ్ల అథ్లెట్ పర్వీందర్ చౌదరి స్టేడియంలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) దర్యాప్తునకు ఆదేశించింది.
మంగళవారం సాయంత్రం స్టేడియంలోని అథ్లెటిక్స్ అకాడమీ వద్ద ఉన్న హాస్టల్లోని తన గదికి వచ్చిన పర్వీందర్ గంటన్నర తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. మా పరిసరాల్లోనే విషాదం చోటుచేసుకున్న నేపథ్యంలో దర్యాప్తునకు ఆదేశించాం. సాయ్ సెక్రటరీ స్వర్ణ్సింగ్ సారథ్యంలోని కమిటీ విచారణ చేస్తుంది. వారంలోగా నివేదిక సమర్పిస్తుందని సాయ్ డైరెక్టర్ జనరల్ నీలం కపూర్ వెల్లడించారు.
సాయ్ డైరక్టర్ జనరల్.. వారంలోగా విచారణ పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. గాయం తగిలిన వెంటనే పర్వీందర్ను సఫ్దార్జంగ్ హాస్పిటల్లో చేర్చారు. అప్పటికే అతని బ్రెయిన్ డెడ్ అవడంతో అతనిని డాక్టర్లు కాపాడలేకపోయారని చెప్పారు. అనుకోని ఈ ఘటనతో రూమ్మేట్స్తో పాటు అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురైయ్యారు. దానికి కారణం రోజంతా శిక్షణ తీసుకున్న పర్వీందర్ మొత్తంగా అతని మొహంలో ఒత్తిడి అనేది లేకుండానే ఉన్నాడట.
ఇంకా కపూర్ మాట్లాడుతూ.. అతని ఆత్మహత్యకు బహుశా వాళ్ల నాన్నతో జరిగిన వాదన ఒక కారణం అయి ఉండొచ్చు. సాయంత్రం తన తండ్రితో ఫోన్లో ఆర్థిక విషయాల గురించి మాట్లాడాడు. ఉత్తర్ప్రదేశ్లోని అలీఘడ్కు చెందిన చౌదరి 2017లో బ్యాంకాక్లో జరిగిన ఆసియా యూత్ ఛాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. రిలే పోటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. జులైలో ముగిసిన వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్లో కూడా పాల్గొన్నాడు.