
హైదరాబాద్: అంతర్జాతీయ వేదికలపై భారత యువ క్రీడాకారుల హవా కొనసాగుతోంది. సైక్లింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత సైక్లిస్ట్ ఎసో అల్బెన్ మరో సరికొత్త చరిత్ర సృష్టించాడు. స్విట్జర్లాండ్లోని ఏజైల్ వేదికగా జరిగిన జూనియర్ ప్రపంచ సైక్లింగ్ చాంపియన్షిప్లో అల్బెన్ రజతం సొంతం చేసుకున్నాడు.
దీంతో సైక్లింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత్కు తొలి పతకం అందించిన క్రీడాకారునిగా అల్బెన్ అరుదైన ఘనత సాధించాడు. చివరివరకు హోరాహోరీగా సాగిన పురుషుల కైరీన్ ఈవెంట్లో అండమాన్-నికోబార్ దీవులకు చెందిన ఈ 17 ఏళ్ల సైక్లిస్ట్ 0.017 సెకన్ల తేడాతో జాకబ్ స్టాన్స్టీ(చెక్ రిపబ్లిక్)కి స్వర్ణం చేజార్చుకున్నాడు.
కజకిస్థాన్కు చెందిన అండ్రె చుగావెకు కాంస్య పతకం దక్కింది. తన విజయంపై అల్బెన్ మాట్లాడుతూ "పసిడి చేజార్చుకున్నందుకు ఒకింత అసంతృప్తితో ఉన్నా, మిగతా రేసర్లతో క్రాష్ కాకుండా ఉండేందుకు దూకుడు ప్రదర్శించాను. కచ్చితంగా పతకం గెలుస్తానన్న నమ్మకంతోనే బరిలోకి దిగాను. రజతం గెలువడం సంతోషంగా ఉంది" అని అన్నాడు.
మరోవైపు పురుషుల టీమ్ స్ప్రింట్ ఈవెంట్లో ఎసో అల్బెన్, మయూర్ పవార్, జేమ్స్ కేథిల్క్పామ్ సింగ్ జోడీ ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమైంది. రజత పతకంతో చరిత్ర సృష్టించిన ఎసో అల్బెన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎసో విజయంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాథోడ్ "వెల్డన్ ఎసో! అద్భుతమైన ప్రదర్శన. మరిన్ని పతకాలు త్వరలో రాబోతున్నాయి" అని ట్వీట్ చేశారు.