
టోక్యో: ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ 2021లో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కలకలం రేపింది. ఒలింపిక్స్ గ్రామంలో సోమవారం మరో 16 మంది క్రీడాకారులకు వైరస్ సోకింది. కరోనా సోకిన వారిలో ముగ్గురు విదేశీ అథ్లెట్లు ఉన్నారని ఒలింపిక్స్ నిర్వాహకులు వెల్లడించారు. కరోనా సోకిన అథ్లెట్లను టోక్యో క్రీడా విలేజ్ నుంచి బయటకు పంపంచి క్వారంటైన్ చేశారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారట. నిర్వాహకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రోజురోజుకు కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఒలింపిక్స్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
టోక్యో ఒలింపిక్స్ 2021లో కరోనా వైరస్ పాజిటివ్ రోగుల సంఖ్య సోమవారం నాటికి 148కి చేరింది. 13 ఆటలకు సంబంధించిన 8 మంది క్రీడాధికారులు కూడా కరోనా బారిన పడ్డారు. టోక్యో ఒలింపిక్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఓ అథ్లెట్లుకు కరోనా సోకింది. డచ్ రోవర్ ఫిన్ ఫ్లోరిజ్న్ కు కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని క్వారంటైన్కు తరలించారు. ఒకవైపు గేమ్స్ సాగుతుండగా, మరోవైపు క్రీడాగ్రామంలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు.
తాజాగా జపాన్ రాజధాని నగరంలో కొత్త కేసులు ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. వారం రోజల క్రితం దాదాపు 2000 వేల కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభణ దృష్ట్యా ఆగస్టు 22 వరకు అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అత్యయిక స్థితి సమయం ముగిసేలోపే ఒలింపిక్ క్రీడలు ముగిసిపోనున్నాయి. కరోనా మహమ్మారి కలకలంతో టోక్యో క్రీడలకు అభిమానుల రాకను సైతం నిషేధించారు. దీంతో వారు టీవీల్లో చూస్తున్నారు.
రాబోయే కొన్ని వారాల్లో టోక్యోలో కరోనా ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వ నిపుణుల బృందం సభ్యుడు డాక్టర్ నోరియో ఒహమగరి ఇటీవల మాట్లాడుతూ.. ఇదే వేగంతో కేసులు పెరిగితే మరో 7-10 రోజుల్లో టోక్యోలో రోజుకు సగటున 2500 చొప్పున కేసులు నమోదవుతాయన్నారు. జపాన్లో ఇప్పటివరకు దాదాపు 85800 కేసులు, 15వేల మరణాలు నమోదయ్యాయి.