
హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ ఆరో సీజన్ కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఆగస్టులో ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా ఆసియా గేమ్స్ జరగనున్న నేపథ్యంలో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) షెడ్యూల్ను వెనక్కి జరపారు. దీంతో ప్రో కబడ్డీ ఆరో సీజన్ అక్టోబరు 5న ప్రారంభమై వచ్చే జనవరి 5న జరిగే ఫైనల్తో ముగియనుంది.
ఈ మేరకు షెడ్యూల్ను ఖరారు చేసినట్లు నిర్వాహక సంస్థ మషాల్ స్పోర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. పాత పద్ధతిలోనే ఈసారీ 13 వారాల పాటు 138 మ్యాచ్ల్ని నిర్వహించనునట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ "గతంలో ఎప్పుడూ కబడ్డీ లీగ్ నిర్వహించే జూలై-అక్టోబర్ నెలల్లో ఆసియా గేమ్స్ ఉన్నందున ఆసియా క్రీడలకు ఆటగాళ్లు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జులై నుంచి అక్టోబర్ మధ్యలో జరిగే ఆరో సీజన్ను అక్టోబర్ నుంచి జనవరి వరకు జరిగేలా మార్పులు చేశాం" అని అన్నారు.
గత సీజన్లలాగే ఆరో సీజన్ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుందని, అద్భుతమైన కబడ్డీ అనుభవాన్ని ఇస్తుందని గోస్వామి తెలిపారు. ప్రో కబడ్డీ ఆరో సీజన్ లీగ్ పోటీలను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు ఆయన తెలిపారు. త్వరలోనే ఆరో సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.