
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-8 సమరానికి సమయం దగ్గరపడుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గతేడాది బ్రేక్ రాగా.. ఈ సారి డబుల్ ధమాకా అందించేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో పీకేఎల్ 2021 కోసం సోమవారం వేలం జరిగింది. స్టార్ రైడర్, డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్.. పీకేఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. యూపీ యోధ జట్టు వేలంలో సోమవారం అతణ్ని రికార్డు స్థాయిలో రూ 1.65 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పర్దీప్ నర్వాల్ రికార్డు సృష్టించాడు.
తొలిసారి వేలానికి వచ్చిన రైడర్ పర్దీప్ నర్వాల్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు యూపీ యోధ అతడి కనీస ధర రూ. 30 లక్షలకు ఐదు రెట్లుపైగా వెచ్చించి మరీ సొంతంచేసుకుంది. ఆదివారం మొదలైన ఈ వేలంలో 161 మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు. మంగళవారం వేలం ముగియనుంది. కేటగిరీ-ఎ ఆటగాళ్ల వేలంలో రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ను రూ. 1.30 కోట్లకు తెలుగు టైటాన్స్ అట్టిపెట్టుకుంది. గత సీజన్లో రూ. కోటికి పైగా పలికిన రాహుల్ చౌదరిపై ఈసారి ఫ్రాంచైజీలు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించలేదు. చివరకు పుణెరి పల్టన్ అతడిని రూ. 40 లక్షలకే దక్కించుకుంది.
మంజీత్ను రూ.92 లక్షలకు తమిళ తలైవాస్ చేజిక్కించుకుంది. సచిన్ (రూ.84 లక్షలు)ను పట్నా పైరేట్స్, రోహిత్ గులియా (రూ.83 లక్షలు)ను హరియాణా స్టీలర్స్, సుర్జీత్ సింగ్ (రూ.75 లక్షలు)ను తమిళ్ తలైవాస్, రవిందర్ పాహల్ (రూ.74 లక్షలు)ను గుజరాత్ జెయింట్స్, ఆల్రౌండర్ దీపక్ నివాస్ హుడాను రూ. 55 లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్, విశాల్ భరద్వాజ్ను రూ. 60 లక్షలకు పుణెరి పల్టన్, సందీప్ కుమార్ ధుల్ను రూ. 50 లక్షలను జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేశాయి. వేలం మంగళవారం కూడా కొనసాగనుంది. అయితే పర్దీప్ నర్వాల్ను ఎవరూ దాటే అవకాశం లేదు.
సీజన్ 8 కోసం ప్రతీ టీమ్ ఆరుగురు సీనియర్ ప్లేయర్లను.. మరో ఆరుగురరు యువ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. మిగతా ఆటగాళ్లు వేలంలోకి వచ్చారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేలం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ చానెల్స్లో ప్రసారం అవుతోంది. ఆన్లైన్ వేదిక డిస్నీ స్ట్రీమ్ హాట్స్టార్ వీఐపీలో కూడా ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. అంతేకాకుండా అధికారిక ప్రొకబడ్డీ వెబ్ సైట్లో వివరాలు తెలుసుకోవచ్చు. డిసెంబర్ 2021లో సీజన్ 8 జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను అనుసరించి టోర్నీ జరగనుంది.
2014లో 8 జట్లతో ప్రారంభమైన పీకేఎల్ ప్రేక్షకాదరణతో అంచెలంచెలుగా ఎదిగి మరో 4 జట్ల చేరికతో బిగ్ లీగ్గా అవతరించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలోనే భారీ అభిమానగణాన్ని సంపాదించుకుంది. భారత సంప్రదాయ క్రీడల్లో ఒకటైన కబడ్డీ.. ఆటగాళ్లపై ప్రస్తుతం కనకవర్షం కురిపిస్తోంది. జట్లు ఇవే.. 1. బెంగాల్ వారియర్స్, 2. బెంగళూరు బుల్స్, 3. దంబంగ్ ఢిల్లీ, 4. జైపు పింక్ పాంథర్స్, 5. గుజరాత్ ఫార్చూనైట్స్, 6. తమిళ్ వారియర్స్, 7. తెలుగు టైటాన్స్, 8. యూ ముంబా, 9. హర్యానా స్టీలర్స్, 10. యూపీ యోధా,11. పాట్నా పైరెట్స్, 12. పుణేరి పల్టాన్.