
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న తెలుగు టైటాన్స్ మరోసారి గెలుపు ముంగిట బోల్తా పడింది. శుక్రవారం తెలుగు టైటాన్స్, యూపీ యోధా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నాటకీయ పరిణామాల మధ్య 20-20 పాయింట్లతో డ్రాగా ముగిసింది.
ఆఖరి 30 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా.. ఇరు జట్ల స్కోరు 19-19తో సమంగా ఉన్నాయి. ఈ దశలో తెలుగు రైడర్స్ సిద్ధార్ధ్ కూతకు వెళ్లాడు. ఆ సమయంలో యూపీ ఆటగాడు సుమిత్ కోర్టు బయటకు వెళ్లడంతో 20-19తో టైటన్స్ గెలుపు ఖాయమైంది. దీంతో టైటాన్స్ విజయం సాధించిందని సంబురపడే లోపే.. అంపైర్లు ఊహించని షాకిచ్చారు.
నిర్ణీత సమయం ముగిసినట్లు ప్రకటించకముందే తెలుగు టైటాన్స్ ఆటగాడు ఒకరు కోర్టులోకి రావడంతో ప్రత్యర్థికి టెక్నికల్ పాయింట్ దక్కింది. స్కోరు 20-20తో సమమైంది. దీంతో చిక్కినట్టే చిక్కిన తొలి విజయం టైటాన్స్కు అందకుండా పోయింది. ఈ సీజన్లో గెలుపు రుచి చూడని జట్టు ఏదైనా ఉందంటే అది తెలుగు టైటాన్సే.
ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్లో ఇదే తొలి టై కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టైటాన్స్ 2-1తో ముందంజ వేసింది. మ్యాచ్ ఆరంభం నుంచీ మ్యాచ్ నువ్వానేనా అన్నట్లు సాగింది. దీంతో తెలుగు టైటాన్స్ ఆధిక్యం 7-9కి తగ్గింది. ఆ తర్వాత యుపీ యోధా రెండు ట్యాకిల్స్ చేయడంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి ఇరు జట్ల స్కోరు 11-11గా ఉంది.
ఇక, రెండో అర్ధభాగంలో టైటాన్స్, యూపీ చెరో పాయింట్ సాధిస్తూ వెళ్లడంతో స్కోరు 15-15తో సమమైంది. అయితే సిద్ధార్థ్ కూతకెళ్లి పాయింట్ తేవడం, డిఫెండర్లు రెండు ట్యాకిల్స్ చేయడంతో టైటాన్స్ మళ్లీ 18-15తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో యూపీ ఓ రైడ్ పాయింట్, ఓ సూపర్ ట్యాకిల్తో స్కోరును 19-19తో సమం చేసింది.
తెలుగు టైటాన్స్ తరఫున సిద్దార్థ్ దేశాయ్ 16 రైడ్లు చేసి 5 పాయింట్లు సాధించగా.. ఫర్హద్, అబోజర్ మిఘాని చెరో 4 పాయింట్లు సాధించారు. యూపీ తరఫున అమిత్, శ్రీకాంత్, నితీశ్ కుమార్ తలా 4 పాయింట్లు నమోదు చేశారు. మరోమ్యాచ్లో యూ ముంబా 32-20తో గుజరాత్ ఫార్చూ న్ జెయింట్స్పై విజయం సాధించింది.