
లండన్: విదేశీ.. స్వదేశీ లీగ్ల కంటే తెలుగు కుర్రాళ్ల లీగ్ మరింత కేక పుట్టించేందుకు సన్నద్ధమవుతోంది. భారీ సన్నాహాలతో మొదలవుతోన్న ప్రొ కబడ్డీ లీగ్కు ముందు కబడ్డీ అభిమానులకు హుషారెత్తించేందుకు సిద్ధం కానుంది తెలంగాణ ప్రీమియర్ లీగ్. దీంతోనే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి క్రీడా రంగంలోకి అడుగుపెట్టారు. ఇంతకాలం మెగాఫోన్ చేతబట్టి నటీనటులకు తన దర్శకత్వంతో సూచనలు చేసిన రాజమౌళి.. ఇప్పుడు కబడ్డీ జట్టులో ఆటగాళ్లను ప్రోత్సహించనున్నారు.
తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ సీజన్ 2 మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతోంది. ఈ లీగ్లో ఒక కబడ్డీ జట్టును రాజమౌళి కొనుగోలు చేశారు. నిర్మాత సాయి కొర్రపాటి, తనయుడు ఎస్.ఎస్.కార్తికేయతో కలిసి 'నల్గొండ ఈగల్స్' జట్టును రాజమౌళి సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తనదైన శైలిలో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఈ మేరకు మంగళవారం ప్రోమోను విడుదల చేశారు.
ఫాంటసీలను కళ్లకు కట్టినట్లుగా సినిమాల్లో చూపించే రాజమౌళి.. తన స్టాండర్డ్కు ఎక్కడా తగ్గకుండా ప్రోమోను డిజైన్ చేశారు. కాగా, తెలంగాణ ప్రీమియర్ కబడ్డి సీజన్ 2 ఈనెల 14న మొదలై వచ్చే నెల 31 వరకు జరుగుతుంది. హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రోజూ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మ్యాచ్లు జరుగుతాయి. రోజుకి రెండు మ్యాచ్లు నిర్వహిస్తారు. స్థానిక కబడ్డీ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో భాగంగా ఈ లీగ్ను ఏర్పాటుచేశారు. లీగ్లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి.
నల్లగొండ ఈగల్స్తో పాటు హైదరాబాద్ బుల్స్, రంగారెడ్డి రైడర్స్, వరంగల్ వారియర్స్, కరీంనగర్ కింగ్స్, గద్వాల్ గ్లాడియేటర్స్, పాలమూరు పాంతర్స్, మంచిర్యాల టైగర్స్ తలపడనున్నాయి. ఈ లీగ్లో 16 మంది స్టార్ కబడ్డీ ప్లేయర్లు పాల్గొంటున్నారు. రోజుకి రెండు మ్యాచ్ల చొప్పున మొత్తం 32 మ్యాచ్లు జరుగుతాయి.