ప్రోకబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణెరి పల్టాన్ బోణీ కొట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ జైపుర్ పింక్ పాంథర్స్కు షాకిచ్చింది. హోరాహొరీగా సాగిన ఈ పోరులో 37-33 తేడాతో విజయం సాధించింది. మొదటి అర్ధభాగంలో వెనుకంజలో ఉన్నా తర్వాత పల్టాన్ టీమ్ గొప్పగా పుంజుకుంది. ఫస్టాఫ్లో పల్టాన్ను ఆలౌట్ చేసిన జైపుర్ 18-14తో ఆధిక్యంలో నిలిచింది.
కానీ బ్రేక్ తర్వాత పుణెరి పల్టాన్ రైడింగ్, డిఫెన్స్లో అదరగొట్టింది. ప్రత్యర్థి ఆటగాళ్లను బోల్తాకొట్టిస్తూ పాయింట్లు సాధిస్తూ ఆధిపత్యం చెలాయించింది. రెండో అర్ధభాగంలో జైపుర్ జట్టును పల్టాన్ రెండు సార్లు ఆలౌట్ చేయడం విశేషం. విజయంలో రైడర్లు అస్లాం సూపర్ 10తో, మోహిత్ 8 పాయింట్లతో సత్తాచాటారు.మరోవైపు జైపుర్లో రైడర్ అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లు సాధించాడు. కానీ అతడికి రైడింగ్ మరో ప్లేయర్ సహకరించకపోవడంతో ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.

మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై బెంగాల్ వారియర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లోనైనా ఖాతా తెరవాలనుకున్న బెంగళూరుకు నిరాశే మిగిలింది. అయితే మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆఖరి క్షణం వరకు సాగిన ఈ పోరులో 32-30తో బెంగాల్ గెలిచింది. ఫస్టాప్ ముగిసే సమయానికి వారియర్స్ ఫేవరేట్గా నిలిచింది. కానీ బుల్స్ ప్లేయర్లు గొప్పగా పోరాడారు. ఆఖర్లో ఇరు జట్లు 28-28తో సమంగా నిలిచాయి. కానీ బెంగాల్ ఒత్తిడిని తట్టుకుని విజయతీరాలకు చేరింది. బెంగాల్ సారిథి మణీందర్ సింగ్ 11 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా నేడు రాత్రి 8 గంటలకు గుజరాత్ జెయింట్స్, యు ముంబా తలపడనున్నాయి. గుజరాత్ జెయింట్స్ ఆడిన రెండు మ్యాచ్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్ టాప్లో నిలిచాయి. మరోవైపు ఆడిన యు ముంబా ఆడిన ఒక్క మ్యాచ్లో గెలిచి నాలుగో స్థానంలో ఉంది.