
సిద్ధార్థ్ దేశాయ్ పోరాటం వృథా
పుణేరి పల్టాన్, తెలుగు టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చివరి క్షణంలో కానీ ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ చెలరేగి ఆడాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ టైటాన్స్ను విజయం దిశగా నడిపించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన టైటాన్స్.. ఫస్ట్ హాఫ్లోనే ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 17-13తో అధిక్యంలో నిలిచింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి 20-14తో మంచి అధిక్యత సాధించింది. అయితే సెకాండాఫ్లో పుణేరి పల్టాన్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. తెలుగు టైటాన్స్ను ఆలౌట్ చేసి ఓ దశలో 4 పాయింట్ల అధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ దశలో అలర్ట్ అయిన తెలుగు టైటాన్స్ స్కోర్ను 25-25తో సమం చేసింది. ఇరు జట్లు పట్టుదలగా పోరాడడంతో 33-33 వద్ద స్కోర్లు మళ్లీ సమం అయ్యాయి. చివరి రైడ్లో తెలుగు టైటాన్స్ 33-34 తేడాతో ఒక్క పాయింట్ వెనుకంజలో నిలిచింది. ఈ సమయంలో రైడ్కు వెళ్లాడు రాకేష్. టైటాన్స్ మ్యాచ్ కాపాడుకోవాలంటే కచ్చితంగా పాయింట్ సాధించాల్సిన ఆ రైడ్లో రాకేష్ బోనస్ సాధించాననే కాన్ఫిడెంట్తో తిరిగొచ్చాడు. కానీ రిఫరీ ఎలాంటి బోనస్ పాయింట్ ఇవ్వలేదు. దీంతో టైటాన్స్ రివ్యూకు వెళ్లింది.
రివ్యూలో కూడా బోనస్ పాయింట్ రాలేదని తేలడంతో తెలుగు టైటాన్స్కు ఒక్క పాయింట్ తేడాతో ఓటమి తప్పలేదు. కాగా తెలుగు టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ మాత్రం 15 పాయింట్లతో సత్తా చాటాడు. అయితే పోరాటం వృథా అయింది.

పాయింట్ తేడాతో గెలిచిన యూపీ
అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగింది. యూపీ యోధా, పాట్నా పైరేట్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో కూడా చివరి నిముషంలో కానీ ఫలితం తేలలేదు. చివరకు 36-35తో పాట్నా పైరేట్స్పై ఒక్క పాయింట్ తేడాతో నెగ్గింది యూపీ యోధా. యూపీ రైడర్ ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో సత్తా చాటాడు. సుమిత్ 6 పాయింట్లు సాధించాడు. పాట్నా పైరేట్స్ రైడర్ సచిన్ 10 పాయింట్లతో సత్తా చాటగా.. 8 పాయింట్లతో ప్రశాంత్కుమార్ రాజ్, 7 పాయింట్లతో షాదులి తోడుగా నిలిచారు.

చెలరేగిన అర్జున్.. అయినా ఓటమి
జైపూర్ పింక్ పాంథర్స్, హర్యాణా స్టీలర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి నిముషంలో 40-38 తేడాతో హర్యాణా స్టీలర్స్పై జైపూర్ పింక్ పాంథర్స్ 2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. జైపూర్ రైడర్ అర్జున్ దేశ్వాల్ 18 పాయింట్లతో చెలరేగాడు. మరో రైడర్ దీపక్ హోడా 10 పాయింట్లు సాధించాడు. హర్యాణా రైడర్ వికాష్ ఖండోల 10 పాయింట్లు సాధించగా, రోహిత్ గులియా 7 పాయింట్లు సాధించాడు.

నేటి మ్యాచ్లు
ప్రొకబడ్డీ లీగ్లో నేడు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. రాత్రి 7:30 గంటలకు జరగనున్న తొలి మ్యాచ్లో గుజరాత్ జయింట్స్, దబాంగ్ ఢిల్లీ తలపడనున్నాయి. రాత్రి 8:30 గంటలకు జరగనున్న మరో మ్యాచ్లో బెంగళూర్ బుల్స్, బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి.


Click it and Unblock the Notifications












