హైదరాబాద్: సొంతగడ్డపై తెలుగు టైటాన్స్కు మళ్లీ నిరాశే ఎదురైంది. వరుసగా మూడో మ్యాచ్లో ఓటమి పాలైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో కొత్త జట్టు యూపి యోధా 31-18 చేతిలో తెలుగు టైటాన్స్ చిత్తుగా ఓడింది.
తొలుత పోటాపోటీగా ఆడి తొలి అర్ధ భాగాన్ని 11-12తో ముగించిన టైటాన్స్ ద్వితీయార్ధంలో తేలిపోయింది. కెప్టెన్ రాహుల్ చౌదరి (7 పాయింట్లు) ఫర్వాలేదనిపించినా.. కీలక సమయాల్లో మాత్రం విఫలయ్యాడు. డిఫెన్స్లో సమన్వయలోపం, రైడింగ్లో రాహుల్చౌదరిపై ఆధారపడటం టైటాన్స్ ఓటమికి కారణమైంది.

మ్యాచ్ ఆరంభంలో హోరాహోరీగా నడిచింది. ఇరు జట్లూ చెరో పాయింట్ సాధిస్తూ వెళ్లడంతో ఆట 2-2, 3-3, 6-6, 8-8 నువ్వానేనా అన్నట్టుగా సాగింది. తొలి రైడ్లోనే ఖాతా తెరిచిన కెప్టెన్ రాహుల్ మొదటి ఆరు రైడ్స్లో నాలుగు పాయింట్లు రాబట్టాడు.
యుపి రైడర్లు నితిన్ తోమర్, రిశాంక్ దేవడిగా కూడా పోటాపోటీగా పాయింట్లు తీసుకెళ్లారు. రైడింగ్లో ఇరుజట్లు సమంగా కనిపించినా.. డిఫెన్స్లో యూపీ మెరుగ్గా ఆడింది. ట్యాకిల్ పాయింట్లతో టైటాన్స్పై ఆధిక్యం సంపాదించింది.
అయితే, 12వ నిమిషంలో రాహుల్ను టాకిల్ చేసిన యోధా 10-8తో ఆధిక్యంలోకి వెళ్లింది. రిశాంక్ ధాటిగా ఆడుతున్నా.. రాకేశ్ కుమార్, వికాస్ ప్రత్యర్థికి గట్టిపోటీ ఇచ్చారు. దాంతో 11-12తో టైటాన్స్ ప్రధమార్దాన్ని ముగించింది. ఇక, ద్వితీయార్థం ప్రారంభంలోనూ ఆట నువ్వానేనా అన్నట్టు సాగింది.
నీలేష్, రాహుల్ చాకచక్యంగా చెరో టచ్ పాయింట్ తేవడంతో ఆతిథ్య జట్టు 13-14తో నిలిచింది. కానీ, 16వ నిమిషంలో సబ్స్టిట్యూట్గా వచ్చిన సురేందర్సింగ్ డూ ఆర్ డై రైడ్లో సూపర్ రైడ్తో 3 పాయింట్లు సాధించి యూపీ ఆధిక్యాన్ని 17-13కు పెంచాడు. ఈ రైడ్ యూపీలో ఉత్సాహం నింపింది.

అక్కడ్నుంచి మ్యాచ్ యూపీ వైపు సాగింది. రైడర్లు, డిఫెండర్లు కలిసికట్టుగా రాణించడంతో యూపీ ఆధిక్యం పెరుగుతూ పోయింది. మరోవైపు టైటాన్స్ పూర్తిగా రాహుల్పైనే ఆధారపడింది. అతను రైడ్కు వెళ్లినప్పుడే పాయింటు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
డూ ఆర్ డై రైడ్లో రాహుల్ విఫలమవగా.. కోర్టులో మిగిలిన రాకేష్, నీలేష్ కూడా అవుటవ డంతో 29వ నిమిషంలో టైటాన్స్ ఆలౌటైంది. మరోవైపు తెలివిగా ఆడుతూ పాయింట్లు రాబట్టిన యూపీ ఒకదశలో 25-14తో 11 పాయింట్ల ఆధిక్యం సంపాదించింది.
ఈ సమయంలో రాహుల్ చెలరేగి వరుస పాయింట్లు గెలవడంతో టైటాన్స్ 17-25తో పోటీనిచ్చేలా కనిపించింది. 37వ నిమిషంలో టైటాన్స్ 18-25తో నిలిచింది. ఈ దశలో ప్రత్యర్థి కోర్టులో ముగ్గురు ప్లేయర్లే మిగలడంతో వారిని ఆలౌట్ చేస్తే తెలుగు టైటాన్స్కు లాభించేది.
కానీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. పాయింట్లు తేవాలన్న ఒత్తిడిలో నీలేష్ సూపర్ టాకిల్ అవగా.. ఆపై, రాహల్ కూడా అవుట్ కావడంతో ఆతిథ్య జట్టుకు భారీ ఓటమి తప్పలేదు. యూపీ రైడర్లు నితిన్ (6), రిషాంక్ (5) మెరిశారు. నితేష్కుమార్ ఐదు ట్యాకిల్ పాయింట్లతో అదరగొట్టాడు.