మరో మ్యాచ్ టై
పాట్నా పైరేట్స్, తమిళ్ తలైవస్ మ్యాచ్లో ఆరంభం నుంచే ఇరు జట్టు దూకుడుగా ఆడాయి. అయితే ఆరంభంలో పాట్నా పై చేయి సాధించింది. తొలి అర్ధభాగంలో చివర్లో తమిళ్ తలైవస్ను ఆలౌట్ చేసింది. తద్వారా పాట్నా 18-12తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో అర్దభాగంలోనూ ఆరంభంలో పాట్నాఅధిక్యత కనబరిచింది. కానీ 8 నిముషాల తర్వాత తమిళ్ తలైవస్ పుంజుకుంది. పాట్నాను ఆలౌట్ చేసి మ్యాచ్లోకి వచ్చింది. ఇంతలోనే ఆ జట్టు రైడర్ అజింక్య పవార్ సూపర్ 10తో చెలరేగడంతో తలైవస్ తొలి సారి మ్యాచ్లో అధిక్యంలోకి వచ్చింది. 23-22 తో అధిక్యంలో నిలిచింది. ఇక్కడి నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. అయితే తమిళ్ తలైవస్ 28-27తో అధిక్యాన్ని కాపాడుకుంది. చివరి రెండు నిముషాల్లో పాట్నా పుంజుకుంది. తమిళ్ తలైవస్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. దీంతో చివరికి మ్యాచ్ 30 - 30 తో టైగా ముగిసింది. తమిళ్ తలైవస్ జట్టులో అజింక్య పవార్ 12 పాయింట్లతో సత్తా చాటాడు. పాట్నా జట్టులో మోను గోయత్ 9, ప్రశాంత్ కుమార్ 7 పాయింట్లు సాధించారు.
చెలరేగిన పవన్ కుమార్
బెంగళూరు బుల్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్లో బుల్స్ జోరు కొనసాగింది. ప్రత్యర్థి జైపూర్కు ఏ మాత్రం అవకాశం ఇవ్వని బెంగళూరు చివరి వరకు అధిపత్యం కొనసాగించి విజయం ఖాతాలో వేసుకుంది. మ్యాచ్లో ఫస్టాఫ్ ముగిసే సమయానికి బెంగళూరు 20-14 తేడాతో అధిక్యంలో నిలిచింది. సెకాండాఫ్లోనూ జోరు కొనసాగించిన బెంగళూరు ఒక దశలో 37-23తో భారీ అధిక్యంలోకి దూసుకెళ్లింది. చివర్లో జైపూర్ పుంజుకుని వరుసగా పాయింట్లు సాధించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మ్యాచ్ మొత్తంలో బెంగళూరు కెప్టెన్ పవన్ కుమార్ 18 పాయింట్లతో చెలరేగాడు. జైపూర్ జట్టులో అర్జున్ దేశ్వాల్ 13 పాయింట్లతో సత్తా చాటాడు. దీంతో చివరికి మ్యాచ్ను బెంగళూరు 38-31 తేడాతో గెలుచుకుంది. ప్రస్తుతం 7 మ్యాచ్ల్లో 28 పాయింట్లతో బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.
నేటి మ్యాచ్లు
బెంగాల్ వారియర్స్ vs హర్యాణా స్టీలర్స్- రాత్రి 7:30 గంటలకు
జైపూర్ పింక్ పాంథర్స్ vs పుణేరి పల్టాన్- రాత్రి 8:30 గంటలకు