న్యూ ఢిల్లీ: సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి ఊపుమీదున్న తెలుగు టైటాన్స్ జోరుకు కళ్లెం పడింది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 20-27తో యూపీ యోధా చేతిలో ఓడింది. రాహుల్ చౌదరి, అబోజర్ చెరో 6 పాయింట్లు సాధించారు. మ్యాచ్ ఆరంభంలో యూపీ యోధ ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. 3-0తో ఆధిక్యం సాధించి టైటాన్స్ను ఒత్తిడిలోకి నెట్టాలని చూశారు. అయితే పుంజుకున్న టైటాన్స్ ఆటగాళ్లు పాయింట్లు సాధించి 4-4తో స్కోరు సమం చేశారు.
రెండు జట్లు పాయింట్ల కోసం హోరాహోరీగా పోటీ పడ్డాయి. దాంతో స్కోరు సమం అవుతూనే వచ్చింది. విరామానికి ముందు ప్రత్యర్థి ఆటగాణ్ని పట్టేసి టైటాన్స్ 11-10తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. టైటాన్స్ జట్టు ట్యాక్లింగ్లో అబోజర్ (6).. యూపీ తరపున నితేశ్ (5) రాణించడంతో మరో పది నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా యూపీ 16-15తో ఆధిక్యం సాధించింది.
ప్రశాంత్ (8) రైడింగ్లో సత్తాచాటడంతో యూపీ ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లింది. టైటాన్స్లో రాహుల్ చౌదరి (6) సత్తామేరకు ఆడలేకపోయాడు. ఈ ఓటమితో ప్లేఆఫ్ అవకాశాలను టైటాన్స్ సంక్లిష్టంగా మార్చుకుంది.
ముంబా తరపున రైడింగ్లో సిద్ధార్థ్ దేశాయ్ (12).. ట్యాక్లింగ్లో ఫజల్ (5) రాణించారు. మరో మ్యాచ్లో యు ముంబా 44-19తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. బుధవారం మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, పట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్ ఆడతాయి.