ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్లో తమ ఆఖరి మ్యాచ్ను తెలుగు టైటాన్స్ 'టై'తో ముగించింది. పంచకుల వేదికగా మంగళవారం యు ముంబాతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో 45-45తో తెలుగు టైటాన్స్ స్కోరును సమం చేసింది. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ పూర్తిగా నిరాశపరిచింది. కేవలం 21 పాయింట్లతో సీజన్ను ముగించింది. 22 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. 19 మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల టేబుల్లో అట్టడుగున నిలిచింది.
అయితే ఆఖరి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ గొప్పగా పోరాడింది. ఓదార్పు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించింది. మ్యాచ్ ఆద్యంతం యు ముంబా, తెలుగు టైటాన్స్ నువ్వానేనా అన్నట్లుగా పోటీపడ్డాయి. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు 19-19 స్కోరుతో సమంగా నిలిచాయి. ముంబా జట్టు రైడింగ్, ట్యాకిల్లో సమానంగా పాయింట్లు సాధించగా, మన జట్టు రైడింగ్లో ఎక్కువగా పాయింట్లు కొల్లగొట్టింది. సాధించిన 19 పాయింట్లలో 11 పాయింట్లు రైడర్లే తీసుకువచ్చారు. అంతేగాక యుముంబాను ఒక్కసారి ఆలౌట్ చేశారు.

సెకండ్ హాఫ్లో పాయింట్లు పోటెత్తాయి. ఇరు జట్లు చెరో రెండు సార్లు ఆలౌటయ్యాయి. అయితే ఓ దశలో తెలుగు టైటాన్స్ మరోసారి ఓటమి దిశగా సాగింది. కానీ కెప్టెన్ పవన్ సెహ్రావత్ మరోసారి వీరోచిత పోరాటం చేశాడు. ఆఖరి రైడ్లలో మల్టిపుల్ పాయింట్లు సాధించాడు. టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు, రాబిన్ చౌదరి ఆరు పాయింట్లతో రాణించారు.యు ముంబా జట్టులో అమిర్ మహమ్మద్ 11 పాయింట్లు, గుమాన్ సింగ్ 8 పాయింట్లు సాధించారు.
కాగా, ఇవాళ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. పంచకుల వేదికగా రాత్రి 8 గంటలకు పుణెరి పల్టాన్తో యూపీ యోధాస్, రాత్రి 9 గంటలకు హర్యానా స్టీలర్స్తో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. ఫిబ్రవరి 26 నుంచి నాకౌట్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. తొలుత ఎలిమినేటర్-1,2 మ్యాచ్లు జరుగుతాయి. అనంతం ఫిబ్రవరి 28 నుంచి సెమీఫైనల్స్, మార్చి 1న ఫైనల్ జరగనున్నాయి. జైపుర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్, గుజరాత్ జెయింట్స్, దబాంగ్ ఢిల్లీ, హర్యానా స్టీలర్స్, పట్నా పైరేట్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.