ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మంగళవారం జరిగిన యు ముంబా - పుణెరి పల్టాన్ మ్యాచ్ 32-32 పాయింట్లతో టైగా ముగిసింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లుగా పోటీపడ్డాయి. తొలి అర్ధభాగం ముగిసేసరికి యు ముంబా 19-17 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. పుణెరి పల్టాన్ను యు ముంబా ఒక్కసారి ఆలౌట్ చేసింది.
అయితే సెకండ్ హాఫ్లో పుణెరి పల్టాన్ పుంజుకుంది. మరింత మెరుగ్గా రాణించి యు ముంబాను ఆలౌట్ చేసి లెక్క సరిచేసింది. అనంతరం మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. 31-31తో మ్యాచ్ కొనసాగింది. ఆఖర్లో పుణెరి రైడర్ మోహిత్.. ముకిలన్ ఔట్ చేసి తమ జట్టును లీడ్లో ఉంచాడు. కానీ తర్వాత రైడ్ను ప్రణయ్ విజయవంతంగా ముగించి స్కోరును 32-32తో సమం చేశాడు.

యు ముంబా జట్టులో రైడర్ గుమన్ సింగ్ 15 పాయింట్లతో సత్తాచాటాడు. డిఫెండర్ గోకులకన్నన్ ఆరు పాయింట్లతో అలరించాడు. పుణెరి పల్టాన్ జట్టులో రైడర్ మోహిత్ ఏడు పాయింట్లు, ఆల్రౌండ్లు అస్లామ్ ఎనిమిది, మొహమ్మద్రీజ ఆరు పాయింట్లతో రాణించారు. కాగా, ఇవాళ హైదరాబాద్ వేదికగా రెండు మ్యాచ్లు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు హర్యానా స్టీలర్స్తో దబాంగ్ ఢిల్లీ పోటీపడనుంది. అలాగే రాత్రి 9 గంటలకు తమిళ్ తలైవాస్తో తెలుగు టైటాన్స్ తలపడనుంది.
ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. 15 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ 13 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. టేబుల్ టాప్లో జైపుర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్ ఉన్నాయి. దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.