ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఫైనల్లో తలపడే జట్లు తేలాయి. బుధవారం హైదరాబాద్ వేదికగా జరిగిన సెమీఫైనల్స్లో జైపుర్ పింక్ పాంథర్స్పై హర్యానా స్టీలర్స్, పట్నా పైరేట్స్పై పుణెరి పల్టాన్ విజయం సాధించాయి. గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 1న జరిగే టైటిల్ పోరులో హర్యానా, పుణెరి తలపడనున్నాయి.
ఇప్పటివరకు హర్యానా, పుణెరి జట్లు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. దీంతో ఈ సారి కొత్త జట్టు ఛాంపియన్గా నిలవనుంది. అంచనాలను తలకిందులుగా చేస్తూ సెమీఫైనల్-2లో హర్యానా స్టీలర్స్ సత్తాచాటింది.రెండు సార్లు టైటిల్ విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ జైపుర్ పింక్ పాంథర్స్ను చిత్తుచేసింది. 27-31 పాయింట్ల తేడాతో హర్యానా విజయం సాధించింది.

మ్యాచ్ ఆరంభం నుంచి హర్యానా పైచేయి సాధించింది. జైపుర్ను ఒక్కసారి ఆలౌట్ చేసి తొలి అర్ధభాగాన్ని 13-19తో ముగించింది. సెకండ్ హాఫ్లో జైపుర్ ప్రతిఘటించింది. కానీ హర్యానా జాగ్రత్తగా ఆడుతూ ఆధిక్యాన్ని కాపాడుకుని తొలిసారి ఫైనల్కు చేరింది. హర్యానా స్టీలర్స్ విజయంలో రైడర్లు వినయ్ 11 పాయింట్లు, శివమ్ ఏడు పాయింట్లతో సత్తాచాటారు. జైపుర్ పింక్ పాంథర్స్లో అర్జున్ దేశ్వాల్ 14 పాయింట్లతో పోరాడాడు.
అంతకుముందు జరిగిన సెమీఫైనల్-1లో మూడుసార్లు టైటిల్ సాధించిన పట్నా పైరేట్స్పై పుణెరి పల్టాన్ 37-21 పాయింట్లతో తేడాతో గెలిచింది. పుణెరికి ఇది వరుసగా రెండో ఫైనల్. గతసీజన్లోనూ ఫైనల్కు చేరిన పుణెరి రన్నరప్గా నిలిచింది. ఫస్ట్ హాఫ్లో పట్నాపై పుణెరి ఆధిపత్యం చెలాయించింది. 20-11తో భారీ ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ హాఫ్లోనూ అదే జోరు కొనసాగించి ఫైనల్కు దూసుకెళ్లింది. కెప్టెన్ అస్లామ్, రైడర్ పంకజ్ చెరో ఏడు పాయింట్లు సాధించారు.