ప్రో కబడ్డీ లీగ్ సీజన్ పదిలో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. వరుసగా మూడు ఓటములతో హాట్రిక్ పరాజయాలు సాధించింది. యూపీ యోధాస్ తో జరిగిన మ్యాచ్ లోనైనా విజయం సాధించి పాయింట్స్ టేబుల్ లో టైటాన్స్ ఖాతా తెరుస్తుందనకుంటే మరోసారి నిరాశపరిచింది.
శనివారం బెంగళూరు వేదికగా యూపీ యోధాస్ తో జరిగిన మ్యాచ్ లో 33-48 తేడాతో ఓటమిపాలైంది. మరోసారి కెప్టెన్ పవన్ సెహ్రావత్ (11) సూపర్ 10తో పోరాడాడు. కానీ అది ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. రజనీస్ ఆరు పాయింట్లు, మిలాద్ నాలుగు పాయింట్లు సాధించారు.

మరోవైపు యూపీ యోధాస్ లో సురేందర్ గిల్ అదరగొట్టాడు. 14 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి తోడుగా యోధాస్ కెప్టెన్ పర్దీప్ నర్వాల్ కూడా రాణించడంతో టైటాన్స్ పై 48-33 తేడాతో విజయం సాధించింది.
బెంగళూరు వేదికగానే శనివారం జరిగిన మరో మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ గెలిచింది. బెంగళూరు బుల్స్ ను 38-32 తేడాతో చిత్తు చేసి బోణీ కొట్టింది. ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లు ఆడిన హర్యానాకు ఇదే తొలి విజయం. కాగా, పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ జెయింట్స్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, అట్టడుగున తెలుగు టైటాన్స్ ఉంది.
ఇవాళ బెంగళూరు వేదికగా రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు బెంగాల్ వారియర్స్, తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. రాత్రి 9 గంటలకు దబాంగ్ దిల్లీతో హర్యానా స్టీలర్స్ పోటీపడనుంది