ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ హోరాహొరీగా సాగుతోంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై తమిళ్ తలైవాస్ 45-28 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ లీగ్లో తలైవాస్కు ఇది అయిదో విజయం కాగా, వరుసగా రెండో గెలుపు. మ్యాచ్ ఆరంభం నుంచి బెంగళూరు బుల్స్పై తలైవాస్ ఆధిపత్యం చెలాయించింది. రైడర్లు సమవుజ్జీలుగా పోరాడుతూ హోరాహొరీగా పాయింట్లు తీసుకొచ్చినా, డిఫెండర్స్లో తలైవాస్ మాత్రమే చెలరేగారు.
తొలి అర్ధభాగం ముగిసేసరికి బుల్స్పై తమిళ్ తలైవాస్ 25-14తో ఆధిపత్యం చెలాయించింది. ఒక్కసారి ఆలౌట్ చేసింది. అనంతరం సెకండ్ హాఫ్లోనూ తలైవాస్ అదే జోరు కొనసాగించింది. అయితే బెంగళూరు బుల్స్ కాస్త ప్రతిఘటించింది. తలైవాస్ను ఒకసారి ఆలౌట్ చేసి తమ జట్టు మరోసారి కుప్పకూలింది. విజయంలో తమిళ్ తలైవాస్ డిఫెండర్స్ సమష్టిగా ప్రధాన పాత్ర పోషించారు.

తమిళ్ తలైవాస్ రైడర్లలో నరేందర్ (14), అజింక్య పవార్ (11) సూపర్-10లతో సత్తాచాటారు.డిఫెండర్లు సాగర్ అయిదు, సాహిల్ నాలుగు పాయింట్లు సాధించారు. బెంగళూరు బుల్స్లో రైడర్ అక్షిత్ (12) పోరాడాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్పై పుణెరి పల్టాన్ 34-24 తేడాతో నెగ్గింది. పుణెరి విజయంలో ఆల్రౌండర్ మహ్మద్రెజా తొమ్మిది పాయింట్లు, రైడర్ మోహిత్ ఏడు పాయింట్లతో కీలకపాత్ర పోషించారు.
ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి పుణెరి పల్టాన్ 22-9తో ఫేవరేట్గా నిలిచింది. గుజరాత్ను ఒకసారి ఆలౌట్ చేసింది.కానీ సెకండ్ హాఫ్లో గుజరాత్ జెయింట్స్ గొప్పగా పోరాడింది. 15-12తో మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ తొలి అర్ధభాగంలో పేలవ ప్రదర్శన వాళ్ల ఓటమికి ప్రధాన కారణమైంది. ఇవాళ హైదరాబాద్ వేదికగా రెండు మ్యాచ్లు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు జైపున్ పింక్ పాంథర్స్తో బెంగాల్ వారియర్స్ తలపడనుంది. అలాగే రాత్రి 9 గంటలకు హర్యానా స్టీలర్స్తో తెలుగు టైటాన్స్ పోటీపడనుంది. ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ రెండు విజయాలే సాధించింది. గత మ్యాచ్లో యూపీ యోధాస్పై నెగ్గింది.