అదరగొట్టిన దీపక్ హుడా:
సోమవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో జైపుర్ 42-23 తేడాతో యు ముంబాపై ఘన విజయం సాధించింది. ఆట ఆరంభంలో నితిన్ రావల్ (7), దీపక్ నర్వాల్ (6) రైడింగ్లో పాయింట్లతో మెరవడంతో ఏడో నిమిషంలోనే ముంబా ఆలౌటైంది. ఇదే సమయంలో జైపూర్ స్టార్ రైడర్స్ దీపక్ హుడా కూడా పుంజుకున్నాడు. మరోవైపు ముంబా కెప్టెన్ ఫజల్ అట్రాచలి డిఫెన్స్లో తడబడడంతో జైపూర్ వరుసగా పాయింట్లు సాధించి తొలి అర్ధ భాగం ముగిసే సరికి 22-9తో నిలిచింది.
తుది వరకూ అదే జోరు:
విరామం తర్వాత ముంబా పుంజుకున్నట్లే కనిపించింది. అభిషేక్ సింగ్ (7), డాంగ్ జియాన్ లీ (6) రాణించడంతో ఓ దశలో 15-27తో నిలిచింది. ఆట చివరలో దీపక్ మరింత దూకుడు ప్రదర్శించాడు. దాంతో మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా జైపుర్ 30-19తో నిలిచింది. ఆఖరి 3 నిమిషాల్లో ముంబైని మరోసారి ఆలౌట్ చేసిన దీపక్.. పాంథర్స్ను 38-20తో నిలబెట్టాడు. తుది వరకూ అదే జోరు కనబరిచిన జైపూర్.. అలవోకగా నెగ్గింది.
అభిషేక్ సందడి:
మ్యాచ్ మొత్తంలో పింక్ పాంథర్స్ రైడింగ్లో 25 పాయింట్లు సాధించగా.. ముంబా 18 పాయింట్లుసాధించింది. డిఫెన్స్లో జైపూర్ 11 పాయింట్లతో చెలరేగితే.. ముంబా 5 పాయింట్లు మాత్రమే చేసింది. ఆలౌట్ల రూపంలో ముంబా 6 పాయింట్లను అదనంగా అప్పగించింది. పాంథర్స్ తరఫున డిఫెన్స్లో అమిత్ హుడా హై 5.. దీపక్ హుడా 11 రైడ్ పాయింట్లు సాధించాడు. జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు యజమాని, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ మ్యాచ్ ఆసాంతం తమ ఆటగాళ్లను ఉత్సాహ పరుస్తూ సందడి చేశాడు.