హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7ను హర్యానా స్టీలర్స్ జట్టు విజయంతో ఆరంభించింది. సోమవారం జరిగిన మ్యాచ్లో రైడర్ నవీన్ (14) ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో హరియాణా స్టీలర్స్ 34-24తో పుణెరి పల్టాన్ను చిత్తు చేసింది. రైడింగ్, ట్యాక్లింగ్లో ఇరు జట్లు పోటీపడినా.. కీలక సమయంలో రెండు సార్లు ఆలౌటైన పల్టాన్స్ ఓటమిని చవిచూసింది. హర్యానా తరఫున నవీన్ 14 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలువగా.. పల్టాన్స్ తరఫున పవన్ కదియాన్ 10 పాయింట్లు సాధించాడు. నవీన్కు పర్ఫెక్ట్ రైడర్, వికాస్ కాలెకు బెస్ట్ డిఫెండర్ అవార్డులు లభించాయి.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
ఆరంభంలో రెండు జట్లు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడడంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. తొలి ఎనిమిది నిమిషాలు ముగిసే సరికి 6-6తో స్కోరు సమమైంది. ఈ దశలో హర్యానా రైడర్ నవీన్ చెలరేగడంతో.. పుణెరి ఆలౌట్ అయింది. దీంతో హర్యానా ఒక్కసారిగా 11-6తో ఆధిక్యం సంపాదించింది. అదే జోరు కొనసాగించిన హరియాణా 22-10తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.
విరామం తర్వాత కూడా హర్యానా ఆటగాళ్లు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అన్ని రంగాల్లో రాణించిన హర్యానా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యాన్ని పెంచుకుంది. చివరి రెండు నిమిషాల ఆట మిగిలి ఉందనగా.. పుణెరి రైడర్లు దూకుడు ప్రదర్శించడంతో 24-31తో హరియాణా జట్టును సమీపించేలా కనిపించారు. కానీ తెలివిగా ఆడిన హర్యానా విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పుణెరి జట్టులో పవన్ కడియాన్ (10) పోరాటం చేసినా ఫలితం దక్కలేదు.
ప్రొ కబడ్డీ లీగ్లో మంగళవారం సెలవు రోజు. బుధవారం జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. వరుసగా రెండు మ్యాచ్ల్లో పరాజయం పాలైన తెలుగు టైటాన్స్ బోణీ కొట్టాలని చూస్తోంది. టెటాన్స్ స్టార్ రైడర్ సిద్ధార్థ్ గాడిలో పడాల్సిన అవసరం ఉంది.