ముంబై: ప్రొ కబడ్డీ ఆరో సీజన్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. జనవరి 5న జరిగే టైటిల్ ఫైట్లో బెంగళూరు బుల్స్తో గుజరాత్ తలపడనుంది. లీగ్ దశ నుంచి పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన గుజరాత్ క్వాలిఫయర్లోనూ అదే జోరు కొనసాగించింది. గురువారం జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ 38-31తో యూపీ యోధాపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో బెంగళూరు బుల్స్తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దాంతో మ్యాచ్ మొదలైన ఐదు నిమిషాలకు స్కోరు 5-5తో సమమైంది. అక్కడి నుంచి ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. అయితే శ్రీకాంత్ జాదవ్ (7) రాణించడంతో యూపీ 13-12తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత గుజరాత్ చెలరేగింది. ఒక దశలో మ్యాచ్పై యూపీ యోధ పైచేయి కనబర్చినా... తొలి అర్ధభాగం ముగిసే సమయానికి గుజరాత్ 19-14తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.
29' Sachin Vittala announces himself with a strong block! 💪
— Gujarat Fortune Giants (@Fortunegiants) January 3, 2019
GUJ 29-14 UP#GarjegaGujarat #NayaKhoonDugnaJunoon #GUJvUP pic.twitter.com/kVaw2NEMJe
ఆ తర్వాతా రెండో సగంలో మరింత దూకుడు పెంచి 29-14తో ముందంజ వేసింది. సచిన్ (10), ప్రపంజన్ (5) సత్తాచాటడంతో వరుసగా పాయింట్లు సాధించి ఓ దశలో 30-16తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తిరిగి పుంజుకున్న యూపీ మరో రెండు నిమిషాలు ఆట ఉందనగా 30-35తో గుజరాత్ను సమీపించింది. చివర్లో తేరుకున్న యూపీ వరుస పాయిట్లతో బెంబేలెత్తించినా చివరకు 7 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది.
చివరి నిమిషాల్లో వ్యూహాత్మకంగా ఆడిన గుజరాత్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ సొంతం చేసుకుంది. క్వాలిఫయర్-1లో తలపడిన జట్లే మరోసారి ఫైనల్లో ఢీకొననున్నాయి. శనివారం బెంగళూరు బుల్స్, గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్ మధ్య టైటిల్ పోరు జరగనుంది.