ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్లో హొరాహొరీగా సాగుతోంది. ఆదివారం ముంబయి వేదికగా జరిగిన పుణెరి పల్టాన్ - తమిళ్ తలైవాస్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్లో తలైవాస్పై పుణెరి 29-26 తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి పుణెరి పల్టాన్ 12-11తో ఆధిక్యంలో నిలిచింది. రైడింగ్, ట్యాకిల్లో పుణెరి సమర్థంగా పాయింట్లు సాధించగా తమిళ్ తలైవాస్ రైడర్లపై ఎక్కువ ఆధారపడింది.
అయితే సెకండ్ హాఫ్లో తలైవాస్ డిఫెండర్లు సత్తాచాటడంతో మ్యాచ్ హొరాహొరీగా సాగింది. అయితే మ్యాచ్ ఆఖర్లో తమిళ్ తలైవాస్ కోర్టులో ముగ్గురు ఆటగాళ్లే ఉన్నారు. మరోవైపు పుణెరి పల్టాన్ రైడర్ అస్లామ్ డూ ఆర్ డై రైడ్కు వెళ్లాడు. డిఫెండర్ నితీశ్ను తాకానని అస్లామ్ వెనక్కి వచ్చాడు. కానీ అంపైర్లు అస్లామ్ను ఔట్గా ప్రకటించారు.

దీంతో సూపర్ ట్యాకిల్గా తలైవాస్కు రెండు పాయింట్లు లభించాయి. స్కోరు 28-28తో సమమైంది. కానీ పుణెరి పల్టాన్ రివ్యూ కోరింది. అనంతరం రివ్యూలో అంపైర్ అస్లాం పాయింట్ తెచ్చాడని ప్రకటించారు. దీంతో 29-26తో పుణెరి పల్టాన్ విజయం సాధించింది. పుణెరి విజయంలో ఆల్రౌండర్ మహమ్మద్రెజా (8) కీలకపాత్ర పోషించాడు. డిఫెండర్ గౌరవ్ ఆరు పాయింట్లు, మరో ఆల్రౌండర్ అస్లామ్ అయిదు పాయింట్లు సాధించారు. తమిళ్ తలైవాస్ టీమ్లో డిఫెండర్ సాగర్ (7) సత్తాచాటాడు.
ముంబయి వేదికగా జరిగిన మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్పై హర్యానా స్టీలర్స్ 41-35తో విజయం సాధించింది. అయితే తొలి అర్ధభాగం ముగిసేసరికి బెంగాల్ వారియర్స్ 17-13తో పైచేయి సాధించింది. కానీ సెకండ్ హాఫ్లో హర్యానా స్టీలర్స్ చెలగేరింది. వరుస పాయింట్లతో సత్తాచాటింది. ట్యాకిల్ పాయింట్లతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. విజయంలో హర్యానా రైడర్లు చంద్రన్ (7), శివమ్ (7), డిఫెండర్ మోహిత్ (5) కీలకపాత్ర పోషించారు. బెంగాల్ వారియర్స్లో రైడర్ జాదవ్ సూపర్-10తో కెప్టెన్ మణిందర్ సింగ్ ఎనిమిది పాయింట్లతో పోరాడాడు.
ఇవాళ ముంబయి వేదికగా బెంగళూరు బుల్స్ - పట్నా పైరేట్స్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. మరో మ్యాచ్లో యు ముంబా - దబంగ్ ఢిల్లీ రాత్రి 9 గంటలకు తలపడనుంది.