ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ ప్రీక్లైమాక్స్ స్టేజ్కు వచ్చేసింది. కీలక మ్యాచ్లో పుణెరి పల్టాన్ చేతిలో బెంగాల్ వారియర్స్ ఓటమిపాలై ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సొంతగడ్డపై కోల్కతాలో నేతాజీ ఇండోర్ స్టేడియం వేదికగా పుణెరితో జరిగిన మ్యాచ్లో బెంగాల్ 26-29 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మరోవైపు బెంగాల్ ఓటమి హర్యానా స్టీలర్స్కు కలిసొచ్చింది. ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.
ఇప్పటికే జైపుర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్, గుజరాత్ జెయింట్స్, దబాంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన ఒక్క బెర్తు కోసం బెంగాల్ వారియర్స్, హర్యానా స్టీలర్స్ మధ్య పోటీ ఉంది. కాగా, పుణెరి పల్టాన్తో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ హాఫ్లో బెంగాల్ పేలవమైన ప్రదర్శన చేసింది. ప్రత్యర్థికి పాయింట్లు ధారాళంగా సమర్పించుకుని 9-18తో వెనుకంజలో నిలిచింది.

కానీ సెకండ్ హాఫ్లో బెంగాల్ వారియర్స్ సత్తాచాటింది. పుణెరి పల్టాన్ను ఒక్కసారి ఆలౌట్ చేసి పాయింట్లను వేగంగా సాధించింది. కానీ తొలి అర్ధభాగంలో ఉన్న 9 పాయింట్ల తేడా బెంగాల్కు ప్రతికూలంగా మారింది. అంతిమంగా మూడు పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. రైడర్ నితిన్ కుమార్ (5) టాప్ స్కోరర్. పుణెరి జట్టులో రైడర్ ఆకాశ్ షిండే సూపర్-10 సాధించాడు.
అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్పై దబాంగ్ ఢిల్లీ 45-43తో గెలిచింది. ఢిల్లీ కెప్టెన్ అషు మాలిక్ 18 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఫస్ట్ హాఫ్లో తలైవాస్ 14-25తో ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ హాఫ్లో అదే జోరును ప్రదర్శించలేకపోయింది. మూడు సార్లు ఆలౌట్ అయ్యింది. తమిళ్ తలైవాస్ జట్టులో రైడర్ నరేందర్ 18 పాయింట్లతో పోరాడాడు.
ఇవాళ పంచకుల వేదికగా రెండు మ్యాచ్లు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు పట్నా పైరేట్స్తో హర్యానా స్టీలర్స్ , రాత్రి 9 గంటలకు జైపుర్ పింక్ పాంథర్స్తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 20 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. 17 పాయింట్లతో టేబుల్ అట్టడుగున 12వ స్థానంలో నిలిచింది.