హైదరాబాద్: రైడింగ్లో ప్రశాంత్ కుమార్ (10).. ట్యాక్లింగ్లో సచిన్ కుమార్ (5) చెలరేగడంతో ప్రొ కబడ్డీ ఆరో సీజన్లో యూపీ యోధ మరో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జోన్- బి మ్యాచ్లో యూపీ యోధ 47-31 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ పట్నా పైరేట్స్ను చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభంలో పట్నాదే ఆధిపత్యం. ఆ జట్టు రైడర్ మంజీత్ (10) వరుస పాయింట్లు తేవడంతో పట్నా 4-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే వెంటనే పుంజుకున్న యూపీ జట్టు.. ప్రశాంత్ రాణించడంతో స్కోరు సమం చేసింది. అక్కడి నుంచి రెండు జట్లు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డాయి.
13వ నిమిషంలో పట్నాను ఆలౌట్ చేసి యూపీ 11-10తో ఆధిక్యాన్ని సంపాదించింది. అదే జోరు కొనసాగిస్తు తొలి అర్ధభాగాన్ని 22-17తో ముగించింది. విరామం తర్వాత కూడా యూపీ అదే దూకుడుతో ఆడింది. యోధా తరఫున ప్రశాంత్ 10 పాయింట్లతో మెరవగా... పట్నా తరఫున మన్జీత్ 10 పాయింట్లు సాధించాడు.
పర్దీప్ నర్వాల్ ఈ మ్యాచ్లో చేదు అనుభవం ఎదురైంది. కేవలం రెండు పాయింట్లతో సరిపెట్టుకున్నాడు. మంజీత్ ఒక్కడే పట్నా పైరేట్స్ జట్టుకు 10పాయింట్లు తెచ్చిపెట్టి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇప్పటికీ పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్ లో స్థానం దక్కించుకోలేదు. ఆటలో ఇంకొంచెం వృద్ధి సాధించనిదే ఆ దశకు చేరుకోవడం అసాధ్యమేనని చెప్పాలి. యూపీ యోధా ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది.
ఇప్పటివరకూ ఈ ఇరుజట్లు తలపడ్డ ఐదు మ్యాచ్లో పట్నా పేరేట్స్ మూడు సార్లు గెలిచింది. ఒక్క మ్యాచ్ టైగా ముగించింది. కానీ, యూపీ యోధా మాత్రం కేవలం ఒక్కసారి మాత్రమే పట్నా పైరేట్స్ను చిత్తు చేయగలిగింది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 29-34తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో ఓడింది.